నిందలు , నిష్టూరాలు, హేళనలు అవమానాలు, ఇలా అన్నిటిని ఎదుర్కొంటూ, దిగమింగుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా, పవన్ పెద్దగా బాధపడింది లేదు సరికదా, మరింత ఉత్సాహంతో పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.తనకు మొదటి నుంచీ ఉన్న సినీ గ్లామర్ తో పాటు, సామాజికవర్గం అండదండలు ఇవన్నీ ఎప్పటికైనా కలిసి వస్తాయని, రాజకీయంగా ఎప్పటికైనా ఉన్నత స్థానానికి తాము చేరుకోగలం అనే నమ్మకంతో పవన్ ఉంటూ వస్తున్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పవన్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై లాంగ్ మార్చ్ నిర్వహించడం, ఇసుక దీక్ష, అమరావతి ఉద్యమం అంటూ గట్టిగానే హడావుడి చేశారు.
ఆ పరిణామాలు ఆ పార్టీలో కాస్త ఊపు తీసుకువచ్చాయి.అప్పుడే బీజేపీ సైతం పవన్ క్రేజ్ ను గుర్తించింది.
ఏపీలో ఎదగాలని చూస్తున్న బీజేపీ కి పవన్ ఆపద్బాంధవుడిలా కనిపించాడు.పవన్ అభిమానులతో పాటు, సామాజికవర్గం అండదండలు ఉంటే సులువుగా అధికారంలోకి రావచ్చనే అభిప్రాయంతో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది.
కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది.పవన్ మాత్రం బీజేపీపై ఎక్కడా అసంతృప్తికి గురి కాకుండా, ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండటం వంటివి బీజేపీ అగ్రనేతలు సైతం గుర్తించారు.
ఇటీవల అంతర్వేది వ్యవహారంలోనూ, జనసేన పార్టీ నాయకులు యాక్టివ్ గా ఉండటం వంటి విషయాలను బీజేపీ గుర్తించింది.
పవన్ కు రాజకీయ ఎత్తుగడలు తెలియక పోవడం వల్లే, ఈ విధంగా ఆయన సక్సెస్ కాలేకపోతున్నారని, బలం, బలగం అన్నీ ఉన్నాయని గుర్తించిన బీజేపీ ఇక పవన్ కు పార్టీలో ప్రాధాన్యం పెంచడంతోపాటు, ఆయనకు మరింతగా ప్రాధాన్యం పెంచుతూ, ముందుకు వెళితే తాము అనుకున్న ఫలితాలు సాధించగలమనే అభిప్రాయంలో ఉన్నారు.అందుకే ఈ దసరా తర్వాత నుంచి జనసేన బీజేపీ ఉమ్మడి కార్యకలాపాలు చేయడంతోపాటు, గతం కంటే ఎక్కువగా పవన్ కు ప్రాధాన్యతను పెంచాలనుకుంటోంది.
అవసరమైతే కేంద్రంలో క్యాబినెట్ స్థాయికి తగ్గ పదవి పవన్ కు అప్పగించడం ద్వారా ఏపీలో మరింతగా బలపడవచ్చు అనే అభిప్రాయంలో ఉంది.
పవన్ చరిష్మాతోనే ఏపీలో బీజేపీ బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తోంది.జనసైనికుల సహకారంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని చూస్తోంది.భవిష్యత్తులో పవన్ తో పొత్తు ఉన్నా లేకపోయినా, తమకు ఏ ఇబ్బంది లేకుండా బీజేపీ చూసుకుంటోంది.