తెలంగాణ బీజేపీ లో నెలకొన్న లుకలుకలు ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాయి.ఒకవైపు అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ.
ప్రజల్లో బీజేపీ క్రెడిట్ పెరిగేలా చేస్తూ, టీఆర్ఎస్ పై బీజేపీ పైచేయి సాధిస్తూ వస్తున్న సమయంలో లో తెలంగాణ బీజేపీ లో అంతర్గతంగా నెలకొన్న విభేదాలు తెరపైకి వచ్చాయి.ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ వర్గం అంతా ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించడం , ఆ తర్వాత జిల్లాల వారీగా రహస్య సమావేశాలు కొనసాగించడం వంటి వ్యవహారాలు పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్ళాయి.
ఒకవైపు టిఆర్ఎస్ పై పైచేయి సాధిస్తూ ఉన్న సమయంలో పార్టీ లో అంతర్గత విభేదాలు బయటపడడాన్నీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.అది కాకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉండడం, ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం, ఇవన్నీ పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఈ అసమ్మతి నేతల వ్యవహారాన్ని తేల్చేందుకు ఇంద్రసేనా రెడ్డి కి పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది.దీనిపై నివేదిక అందించాలని ఆదేశించింది.దీంతో ఈ రహస్య మీటింగ్ నిర్వహించిన నాయకులందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే విషయం తెరపైకి వచ్చింది.దీంతో సదరు నేతలంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసినట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్ నుంచే ఈ వ్యతిరేకత వర్గం యాక్టివ్ కావడాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది.ఇటీవల నిర్వహించిన రహస్య సమావేశానికి నాయకత్వం వహించింది కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అర్జున్ రావు అనే చర్చ బీజేపీ లో జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి , బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ రహస్య మీటింగ్ కు సంబంధించిన విషయాలన్నీ బయటకు పొక్కడంతో దీనిపై ఏం చేద్దామని వీరంతా రెండు మూడు సార్లు సమావేశమైనట్లు సమాచారం.ఈ సీక్రెట్ మీటింగ్ లో వరంగల్ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , రాజేశ్వరరావు, నల్గొండ కు చెందిన చింతా సాంబమూర్తి, నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్, మహబూబ్ నగర్ కు చెందిన బాబురావు నామోజి , హైదరాబాద్ కు చెందిన వెంకట రమణి, వెంకట్ రెడ్డి, రంగారెడ్డి కి చెందిన మల్లారెడ్డి , ఆదిలాబాద్ కు చెందిన గోనె శ్యాంసుందర్ రావు, మరికొంతమంది ఈ రహస్య సమావేశంలో పాల్గొనడంతో వీరందరి పైన సస్పెన్షన్ వేటు వేయాలనే అభిప్రాయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందట.ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.