తాము ఎప్పుడు మీతో నే ఉంటాం.ఆపద సమయంలో ఆదుకుంటాము అన్నట్లుగా బిజెపి జగన్ ప్రభుత్వం తో వ్యవహరిస్తోంది.
కేంద్రం ఏ బిల్లు పెట్టినా, బిజెపి మిత్రపక్షాలు సైతం ఆ బిల్లును వ్యతిరేకించినా జగన్ మాత్రం నేను ఉన్నాను అంటూ బీజేపీ కి సహకారం అందిస్తూ వస్తున్నారు.దీంతో జగన్ ప్రభుత్వానికి అన్ని విషయాలలోనూ సహకరించి తమకు దూరం కాకుండా చూసుకుంటుందని అంతా భావిస్తూ వస్తుండగా, బిజెపి మాత్రం జగన్ విషయంలో పట్టించుకోనట్లు వ్యవహరిస్తోంది.
కేవలం కొన్ని కొన్ని విషయాల్లో తప్ప ఎక్కువ శాతం జగన్ కు వ్యతిరేకంగానే కేంద్ర బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు.అనేకసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేస్తూ జగన్ ను అవమానాలకు గురి చేస్తున్నారు.
అయినా జగన్ మాత్రం ఆ అవమానాలను పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తున్నారు.ఇది బీజేపీకి మరింత అలుసుగా మారింది.
రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కానీ, మరి కొన్ని అంశాలలో బిజెపి సహాయం కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్న పట్టించుకోనట్టుగానే బిజెపి వ్యవహరిస్తోంది.2019 ఎన్నికల తర్వాత జగన్ తో బిజెపి కొంతకాలం పాటు సఖ్యతగా మెలిగింది.అన్ని విషయాలలోనూ సహకారం అందించింది.సోము వీర్రాజు మిగిలిన బీజేపి నాయకులు జగన్ ప్రభుత్వానికి మద్దతు మాట్లాడుతూ, టిడిపి పై పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు.
అయితే ఇప్పుడు బీజేపీ నేతలతో పాటు, కేంద్ర బిజెపి పెద్దలు జగన్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.దీనంతటికీ కారణం జగన్ కు మరో ఆప్షన్ లేదని భావించడమే.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి తో కలిసే అవకాశం లేదు.అలాగే మమత ఆధ్వర్యంలోని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పైన అనేక అనుమానాలు ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా కూటమి ఏర్పాటు చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో రాజకీయంగా వైసీపీని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జగన్ తప్పకుండా తమకు మద్దతు ఇస్తారని, ఆయనకు మరో ఆప్షన్ లేదు అనే విషయాన్ని బీజేపీ బాగా నమ్ముతోంది.అందుకే జగన్ కు ఈ తలనొప్పి ఎక్కువైనట్లు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం జగన్ కు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తీరిక లేనట్లుగా బిజెపి అగ్రనేతలు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.