పైకి ప్రకటించకపోయినా, టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పై చాలా కంగారుగా ఉన్నాయి.తమ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే 2024 ఎన్నికల్లో తమదే విజయం అనే లెక్కలు వేసుకుంటున్నాయి.
అయితే ఇప్పటికిప్పుడు పొత్తు పెట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే విషయం రెండు పార్టీల నేతలకు బాగా తెలుసు.ముఖ్యంగా బిజెపి తో జనసేన పార్టీ పొత్తు కొనసాగిస్తున్న క్రమంలో, టిడిపీని కలుపుకు వెళ్ళాలి అని పవన్ ఆలోచన చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బీజేపీని ఏదో రకంగా ఒప్పించి పొత్తు పెట్టుకోవాలని, తద్వారా జనసేన, టిడిపి, బిజెపిల కాంబినేషన్ లో 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ అధికార పార్టీగా ఉన్న వైసీపీ ని ఓడించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విషయం గుర్తించారు అందుకే విడివిడిగా పోటీ చేసి వైసిపి ఓటు బ్యాంకును చీల్చడం కంటే, అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా సులువుగా వైసీపీ కి అధికారం దక్కకుండా చేయవచ్చు అనే ఆలోచన ను చంద్రబాబు పదేపదే బయటపెడుతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే రకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విషయంలో బీజేపీ సానుకూలంగా లేకపోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు అని ప్రకటించడం ఇవన్నీ టిడిపి జనసేన కు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు.
జనసేన , బీజేపీ మాత్రమే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన ప్రకటిస్తున్నారు.
పవన్ సైతం బిజెపి తో పొత్తు కొనసాగుతుందని ప్రకటిస్తూనే టిడిపి వైపు ఆయన చూస్తున్నారు.అయితే బీజేపీ తో పొత్తు రద్దు చేసుకుని, టీడీపీ తో పొత్తు పెట్టుకుందాం అనే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నా, బిజెపి తో వైరం పెట్టుకుంటే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం గుర్తొచ్చే పవన్ వెనక్కి తగ్గుతున్నరట.ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నందున అప్పుడే తొందరపడకుండా జాగ్రత్తగా ఆడుగులు వేయడమే బెటర్ అన్నట్టుగా పవన్ ఆలోచిస్తున్నారట.