2014 ఎన్నికల సమయంలో బిజెపి తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని విజయాన్ని సాధించాయి.అయితే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొంత కాలం కొనసాగింది.
ఆ తరువాత బిజెపి పూర్తిగా టిడిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయగా, బిజెపి సైతం టీడీపీపై అదేస్థాయిలో కక్ష్య తీర్చుకుంటూ వచ్చింది.అయితే 2019 ఎన్నికల సమయం నాటికి బిజెపి లేని లోటు ఏమిటో టిడిపికి బాగా తెలిసి వచ్చింది.
దీంతో పొత్తు కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టినా, చంద్రబాబు పై కోపంతో వైసిపికి బిజెపి పరోక్షంగా మద్దతు పలకడమే కాకుండా, ఆ ఎన్నికలలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సహాయ సహకారాలు బిజెపి నేతలు అందించారు.ఆ కృతజ్ఞత జగన్ లో ఉండడంతోనే బీజేపీతో పరోక్షంగా స్నేహాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను మిత్రపక్షాలు వ్యతిరేకించినా, జగన్ మాత్రం తమ ఎంపీల ద్వారా బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ వేయిస్తున్నారు.ఏపీకి నిధులు విడుదల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిన బిజెపిని పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితి జగన్ది.
అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ పై ఇటీవల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శలు చేయగా , ఆ విమర్శలకు జగన్ సమాధానం ఇస్తూ కేంద్రాన్ని వెనకేసుకు రావడం పైనా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బిజెపి పెద్దల వద్ద తమ విషయంలో సానుకూల వైఖరి ఉండే విధంగానే జగన్ వ్యవ హరిస్తూ వస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి విషయాల్లో కేంద్రం పట్టించుకోకపోయినా , జగన్ మాత్రం ఎక్కడా బీజేపీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం లేదు.అయితే ఈ వ్యవహారం జగన్ వరకు కరక్టే అయినా, వైసిపి కార్యకర్తలు, ప్రజలలోనూ జగన్ పై చులకన భావం ఏర్పడేలా చేస్తుంది.అడుగడుగున బిజెపి అగ్రనేతలు ఏపీ నేతలు అవమానించేలా మాట్లాడుతున్నా జగన్ మాత్రం బిజెపిని విమర్శించేందుకు , వివిధ అంశాలపై నిలదీసేందుకు ఏమాత్రం ప్రయత్నించకపోవడం, పైగా తాను ఎప్పుడూ బీజేపీకి మద్దతు దారుడినే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు జగన్ ఇమేజ్ ను పల్చన చేస్తోంది.ఇదే మౌనాన్ని జగన్ 2024 ఎన్నికల వరకు కొనసాగిస్తారా లేక చంద్రబాబు మాదిరిగానే బిజెపి పై తిరుగుబాటు జెండా ఎగరవేస్తారా అనేది చూడాలి.