తెలంగాణ బిజెపి లో పరిస్థితి పైకి అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా , లో లోపల మాత్రం గ్రూప్ రాజకీయాలతో నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, ఒకరి ఆజ్ఞలను మరొకరు పాటించేందుకు ఇష్టపడకపోవడం, సొంత పార్టీ నాయకులకు ఎసరు పెట్టేలా ఇంకొంతమంది వ్యవహరించడం ఇలా అనేక కారణాలతో తెలంగాణ బిజెపిలో పరిస్థితి చేయి దాటి పోయినట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా బిజెపిలో రెండు గ్రూపులు ఉన్నట్లుగా చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు రెండు వర్గాలుగా ఉన్నారని, మొన్నటి వరకు సంజయ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఆయన వెంట నడిచిన చాలామంది నాయకులు ఇప్పుడు కిషన్ రెడ్డి గ్రూప్ లో చేరడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం అన్నట్లుగా పరిస్థితి తలెత్తడం ఇవన్నీ బీజేపీ అధిష్టానం వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొంత కాలం పాటు బిజెపి లో స్పీడ్ కనిపించినా, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, గెలుపు తర్వాత బిజెపికి పెద్దగా విజయాలు నమోదు కాకపోవడం, ప్రస్తుతం సంజయ్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉండడం ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయట.
ముఖ్యంగా ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన దగ్గర నుంచి తెలంగాణ బిజెపి లో బాగా స్పీడ్ తగ్గడాన్ని అధిష్టానం పెద్దలు గుర్తించారు.
తాజాగా తెలంగాణలో పర్యటించి బిజెపి సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి జి ఎల్ సంతోష్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయాన్ని గమనించారు. ఎవరైతే ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వారు అందరినీ పిలిచి ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.కొంతమంది గట్టిగా క్లాసు పీకారట.
తెలంగాణ పరిస్థితులపై జాతీయ నాయకులు దృష్టిపెట్టి నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా భావిస్తున్నారు.మరి జాతీయ నేతల వార్నింగ్ లతో అయినా బిజేపి నేతల మనసు మారుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది.