ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’.రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీపరిశ్రమ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి `నాట్యం` సినిమాను ప్రశంసించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.
చిరంజీవి మాట్లాడుతూ.
‘ నాట్యం సినిమా చాలా చక్కగా అనిపించింది.మంచి ఫీలింగ్ను కలిగించింది.
నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం.నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు.
కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా రాజు మాత్రం కథను అందంగా చెప్పడం అని చూపించారు.ఒకప్పుడు ప్రజలకు ఏదైనా చెప్పాలంటే ఇలా ఎంటర్టైన్మెంట్లా చెప్పేవారు.
ఇందులో అదే చూపించారు.ఇలాంటి చిత్రాలు అనగానే మనకు కే విశ్వనాథ్ గారు గుర్తుకు వస్తారు.
ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే ఈ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది.మన కళలు, నాట్యం, సంగీతం ఇలా అన్నింటిపైనా ఆయనకున్న గ్రిప్, ప్యాషన్ గానీ అంతా ఇంతా కాదు.
యంగ్ డైరెక్టర్ అయిన రేవంత్ మళ్లీ ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉంది.ఇలాంటి వారు రావాలి.
మన ఆచారాలు, సంప్రదాయాలు, కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది.ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
దానికి ఆలంబనగా, ఎంతో ప్యాషన్ ఉన్న సంధ్యా రాజు ముందుకు రావడాన్ని మనం అభినందించాలి.
పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు.డబ్బు కోసమని కాకుండా తనకున్న ప్యాషన్, కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది.ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కోట్ల మందికి చేరుతుంది.
సినిమా మాధ్యమం అనేది చాలా ప్రభావవంతమైంది.దీని ద్వారా మీ టాలెంట్ను చూపించాలని అనుకుంటున్నారు.
అది వృథా కాదు.రేవంత్, సంధ్యా రాజు ఇద్దరూ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్.
ఈ చిత్రం హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.చిన్న వయసు వాడైనా సరే.తన డెబ్యూగా ఇలాంటి సినిమాను తీశారు.
ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది.ఇండస్ట్రీని శంకరాభరణం ముందు శంకరాభరణం తరువాత అని అంటుంటారు.అలా శంకరాభరణం సినిమాను ఎంతగా ఆదరించారో ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
అదో క్లాసిక్ చిత్రం.అలానే నాట్యం సినిమాకు కూడా ప్రజాశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను.
ఈ చిత్రం ఎప్పుడు చూస్తానా? అని నాకు కూడా ఆత్రుతగా ఉంది.ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి.
చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
సంధ్యా రాజు మాట్లాడుతూ.‘ఈ కళ డబ్బుతో రాదు.ఎంతో అంకితభావం, కష్టపడితే గానీ రాదని తెలిసింది.
నాట్యం వల్ల జనాలు మనల్ని గౌరవిస్తారు అని.నా జీవితాన్ని నాట్యానికి అంకితం చేశాను.ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.ఆయన గొప్ప డ్యాన్సర్.ఆయన సూర్యుడిలాంటి వారు.మాకు ఆయన ఆశీర్వాదం లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.ఇలాంటి సినిమా ఎలా తీశావ్? అని అందరూ అంటుంటే నాకు భయంగా ఉంటుంది.ఇందులో కేవలం నాట్యం గురించే కాకుండా మన సంస్కృతి కూడా చూపించాం.ఇది తెలుగుదనం ఉట్టిపడే సినిమా.
అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది“అన్నారు
.