ఈ మధ్య కాలంలో సినిమాల్లో, సీరియళ్లలో నటిస్తున్న నటీమణులలో కొంతమందికి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతున్నాయి.ప్రముఖ బెంగాలీ టెలివిజన్ నటి ప్రత్యూష పాల్ కు సైతం సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.
అత్యాచార బెదిరింపులు ఎదురు కావడంతో ప్రత్యూష పాల్ కంగారు పడ్డారు.తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో రిలీజ్ చేశారని ఆమె ఆరోపణలు చేశారు.
ప్రత్యూష పాల్ చేసిన ఆరోపణలు బెంగాల్ లో కలకలం సృష్టిస్తున్నాయి.ప్రత్యుష పాల్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తును మొదలుపెట్టారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది.ఐటీ చట్టం 2000 తో పాటు వెర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది.
గడిచిన ఏడాదిగా తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ప్రత్యూష పాల్ అన్నారు.
తాను సోషల్ మీడియా ద్వారా వచ్చే బెదిరింపులను అస్సలు పట్టించుకోనని అయితే వేధింపులు, బెదిరింపులు శృతి మించడంతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
కొంతమంది తనను రేప్ చేస్తామని కూడా బెదిరించారని ప్రత్యూష పాల్ చెప్పుకొచ్చారు.కొంతమంది తన మార్ఫింగ్ ఫోటోలను స్నేహితులకు, తల్లికి కూడా పంపడంతో తాను ఆందోళనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.
ఆన్ లైన్ ట్రోలింగ్ గురించి గతంలో కూడా కొంతమంది హీరోయిన్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలతో తమ అభిప్రాయాలను పంచుకునే కొందరు నెటిజన్లు వేధింపులకు గురి చేయడం ద్వారా దుర్వినియోగం చేస్తుండటం గమనార్హం.బాల నటిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రత్యూష పాల్ నటిగా అంతకంతకూ ఎదుగుతూ పాపులారిటీని, క్రేజ్ ను పెంచుకున్నారు.వివాదాలకు దూరంగా ఉండే ప్రత్యూష పాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.