టీమిండియా జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.త్వరలోనే ముగియనున్న ఈ సిరీస్ అనంతరం ఇండియా సౌతాఫ్రికాలో పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూసింది.అక్కడ రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు వేలాది సంఖ్యలో పెరిగి పోతున్నాయి.
ముఖ్యంగా టీమిండియా బస చేయనున్న ప్రాంతం ఒమిక్రాన్ కేసులకు హాట్ స్పాట్ గా మారింది.ఈ పరిణామాల మధ్య గత కొద్ది రోజులుగా టీమిండియాని సౌతాఫ్రికా పర్యటనకు పంపించాలా? వద్దా? అనే సందిగ్ధంలో బీసీసీఐ తలమున కలవుతోంది.
అయితే తాజాగా దక్షిణాఫ్రికా టూర్పై సమాలోచనలు చేసిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.కోల్కతా వేదికగా శనివారం సాయంత్రం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సౌతాఫ్రికా టూర్కు పచ్చజెండా ఊపింది బీసీసీఐ.సౌతాఫ్రికా టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని జైషా తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
సఫారీ గడ్డపై టీమిండియా కేవలం 3 టెస్ట్లు, 3 వన్డేల సిరీస్లు మాత్రమే ఆడుతుందని ఆయన స్పష్టం చేశారు.అలాగే 4 మ్యాచ్ల టీ20 సిరీస్ను తర్వాతి తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా సౌతాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడమే శ్రేయస్కరమనే అభిప్రాయాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి.ఈ పర్యటన దాదాపు రద్దయ్యేది కానీ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసే బయో బబుల్లో ప్లేయర్లు సురక్షితంగా ఉంటారని బోర్డు భావించింది.ఈ విషయం గురించి సర్వసభ్య సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంది.“3 టెస్టులు, 3 వన్డేలు సిరీస్ మ్యాచులు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు పయనమవుతుంది.ముందుగా నిర్ణయించినట్టు 4 టీ20 మ్యాచ్ల సిరీస్ మాత్రం తర్వాత జరుగుతుంది.” అని జై షా ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఒమిక్రాన్ వేరియంటే వ్యాప్తి అధికంగా లేని ప్రాంతాల్లో మ్యాచ్లను నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.ఇందులో భాగంగా మరో 48 గంటల్లో వేదికను ఖరారు చేసేందుకు దక్షిణాఫ్రికా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే టీమిండియా డిసెంబర్ 8 లేదా డిసెంబర్ రెండవ వారంలోగా సౌత్ ఆఫ్రికాకి బయల్దేరనుంది.