తెలంగాణలో ఫర్వాలేదు అనుకున్న ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. చెప్పుకోవడానికి పార్టీ తప్ప, ఆ పార్టీ ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదని అనేక ఎన్నికల్లో అర్దం అయిపోయింది .
ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా, బిజెపి పోటీ చేయడం, జీరో ఫలితాలు సాధించడం సర్వసాధారణం అయిపోయింది.అసలు సొంతంగా ఏపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు లేవు.
ఏదో ఒక పార్టీ మద్దతుతో ఒకటి రెండు సీట్లను గెలుచుకోవడం తప్పించి, పెద్దగా ఆ పార్టీ ప్రభావం ఏమి ఇక్కడ కనిపించదు .ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీలు ఏపీ లో పొత్తు పెట్టుకున్నాయి.అయినా ఈ రెండు పార్టీలు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.అసలు బిజెపి జనసేన పొత్తు రద్దు కాబోతోందనే ప్రచారం ఊపందుకుంది.ఈ సమయంలోనే కడప జిల్లా బద్వేలు లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధా ను రంగంలోకి దించగా, జనసేన ,టిడిపిలు మాత్రం తాము సెంటిమెంటును గౌరవిస్తున్నామని, పోటీకి అభ్యర్ధులను నిలబెట్టడం లేదంటూ ప్రకటించాయి.
అయితే ఏ మాత్రం బలం బలగం లేని బీజేపీ మాత్రం తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించడం సంచలనం సృష్టించింది.అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి పవన్ మద్దతు ఇచ్చన క్రమంలో మళ్ళీ బిజెపి తరఫున ఆయన పోటీ చేసే అవకాశం లేదు.దీంతో బిజెపి ఇక్కడ ఎన్నికల ప్రచారం ఒంటరిగానే నిర్వహించాల్సిన పరిస్థితి.
జగన్ సొంత జిల్లా కడప లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ వైపు విజయం ఉంటుందనేది అందరికీ తెలుసు.
అయినా ఏమాత్రం ప్రభావం లేని బిజెపి ఇక్కడ పోటీ చేసి గెలవాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. పోటీకి ఏ ధైర్యంతో అభ్యర్థి నిలబెట్టారు అనేది అందరికీ అనేక సందేహాలు కలిగిస్తోంది.ఇక్కడ బిజెపి మళ్లీ డిపాజిట్ కోల్పోతే ఏపీలో బిజెపి ప్రభావం అనేది లేదనే విషయం అందరికీ అర్థం అయిపోతుంది .ఇది ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారడంతో పాటు, 2024 ఎన్నికలలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది.మరోసారి పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం తప్ప ఫలితం ఏమైనా ఉంటుందా అనే కామెంట్స్ జనాల నుంచే వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా బద్వేల్ ఉప ఎన్నికలు మాత్రం బిజెపి ని మరింత కష్టాల్లోకి నెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.