2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే తీరుతాం.తమ పార్టీ అధికారంలోకి వస్తుంది.
అప్పుడు ఏం చేయబోతుంది అనే విషయాలను ఇప్పటి నుంచే చెప్పేస్తున్నారు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు.బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిల్లర్ లపై చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల ప్రకటించారు.
ఇక జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అని చెబుతూనే ఏపీలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అనే విషయాన్ని హైలెట్ చేస్తూ సోము వీర్రాజు తన పర్యటనలను కొనసాగిస్తున్నారు.వీర్రాజు చెప్పినట్లుగానే ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేంతటి శక్తిసామర్థ్యాలు ఉన్నాయా అంటే అది అనుమానమే.
బిజెపి లో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.మొదట్లో ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించినా, ఆ తరువాత పూర్తిగా ఆగిపోయాయి.
ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బిజెపికి రాజీనామా చేసారు.
ఆయనే కాకుండా ఇంకా ఎంతో మంది నేతలు బీజేపీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉండడంతో అసలు బిజెపిలో ఏం జరుగుతోందనే ఆందోళన ఆ పార్టీ నాయకుల లోనూ నెలకొంది.
మరోవైపు చూస్తే తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంటోంది.
రోజురోజుకు అధికార పార్టీ టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.గట్టి ప్రజా ఉద్యమాలు చేపడుతోంది.
కేంద్ర బిజెపి పెద్దలను తీసుకువచ్చి భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించే స్థాయికి బిజెపి బలం పెంచుకుంది.కానీ ఏపీలో మాత్రం ఎక్కడా ఆ తరహా ప్రయత్నాలు జరగడం లేదు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ లో నాయకులు రెండు మూడు గ్రూపులు ఉన్నారని, ఒక గ్రూపు కు మరో గ్రూపు కు పడడం లేదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.అంతర్గతంగానూ నెలకొన్న సమస్యలపై ఏపీ బీజేపీ నాయకులు దృష్టి పెట్టకపోగా, అధికారంలోకి వచ్చేసాము అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు.
దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.జనసేన తో పొత్తు ఎన్నికల వరకు కొనసాగుతుందనే ఆలోచనలు ఉండడం , జనసేన రాజకీయంగా బలపడితే అది తమకు ఉపయోగపడుతుందనే లెక్కలు ఏపీ బీజేపీ నాయకులు వేసుకోవడంతోనే అధికారంలోకి వస్తామన్న ధీమా కనిపించడానికి కారణం అని అర్థమవుతుంది.