టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అలుపెరగకుండా కష్టపడుతున్నారు.ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ, ఆయన పార్టీకోసం కష్ట పడుతున్నారు .
క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం లేకపోయినా జూమ్ ద్వారా మీడియా సమావేశాలు, పార్టీ నేతలతోనూ చర్చిస్తున్నారు. ఏపీ లో జరుగుతున్న చిన్న అంశాలని సైతం వదిలిపెట్టకుండా, వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతున్నారు.
కరోనా విషయంలో కానీ, మరేదైనా అంశంలో కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశం ఉంటే వదిలిపెట్టడం లేదు.ప్రతిక్షణం వైసిపి పైనే ఫోకస్ పెంచుతున్నారు.ఒకవైపు పార్టీ కార్యక్రమాలను, పార్టీలో అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనిలో ఉంటూనే మరోవైపు ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. అయితే బాబు ఎంతగా పోరాటం చేస్తున్న, టీడీపీకి కలిసివస్తుందా అంటే పెద్దగా లేదనే చెప్పాలి.
దీనికి కారణం సరైన అంశాలను పోరాటంగా ఎంచుకోక పోవడమే కారణంగా కనిపిస్తోంది.కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వార్తలపైన, చిన్న విషయాల పైన కొంతమంది జనాకర్షణ లేని వ్యక్తుల అరెస్టు విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నా ప్రజల్లో పెద్దగా ఆ విషయం వెళ్లకపోవడం, చివరకు టీడీపీనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక కరోనా విషయంలోనూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కరోనా వాక్సిన్ కొనుగోలు విషయంలో జగన్ 1600 కోట్లు కట్టలేక కొనడం లేదు అంటూ చేసిన విమర్శలను జనాలు కూడా రిసీవ్ చేసుకోలేదు.
ఈ ఎందుకు అంటే దేశవ్యాప్తంగా వాక్సిన్ కొరత ఉందనే విషయం బాగా తెలుసు.అసలు వేలాది, కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం అమలు చేస్తున్న జగన్ కేవలం 1600 కోట్ల కోసం ఇంతగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు అనే విషయాన్ని గ్రహించారు.
ఇదంతా టీడీపీ కి కలిసి రాలేదు.ఇక పార్టీకి ఏ సంబంధం లేని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలోనూ టీడీపీ వైఖరి ఇదే విధంగా ఉండడం, చంద్రబాబు సైతం ఈ అంశాన్ని ఫోకస్ చేసుకోవడం వంటివి టీడీపీ పై అనుమానాలను పెంచాయి.
ఈ తరహా అంశాలను తమ పోరాటానికి ఎంచుకోవడం బాబు చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలుగా కనిపిస్తున్నాయి.దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలోనూ కీలకమైన సమస్యలు చాలానే ఉన్నాయి.వాటిపై పోరాడుతూ పలుకుబడి పెంచుకోవాల్సి ఉండగా, తమకు సంబంధంలేని పెద్దగా కలిసిరాని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉండడం వంటివి టీడీపీ ఇమేజ్ ను మరింతగా తగ్గిస్తున్నాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకుండా అభాసుపాలు అవుతున్నట్లు గా కనిపిస్తున్నారు.