వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే రెండేళ్లు పూర్తి అయింది.కానీ పార్టీ కోసం కష్ట పడిన వారికి ఏ న్యాయం జరగలేదనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం.
అధికార పార్టీ లో తాము ఉన్నా, పార్టీని ఈ స్థాయికి తెచ్చేందుకు ఆర్థికంగానూ సామాజికంగానూ తోడ్పాటు అందించిన తమకు సరైన న్యాయం జరగలేదనే బాధ పార్టీ నాయకుల్లో ఉంది.ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర పెద్దగా లేకపోవడం, మరోవైపు తమకు సరైన నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అయితే ఈ విషయాలన్నీ వైసీపీ అధిష్టానానికి తెలిసినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
అయితే ఈ రోజు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.
దాదాపు 70 కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు, ఆ కార్పొరేషన్ కు సంబంధించి 840 మంది డైరెక్టర్ల పదవులను భర్తీ చేసేందుకు ప్రణాళిక రచించారు.
అయితే ఈ భర్తీ లను ఆషామాషీగా చేయకుండా మూడు అంచెలుగా విభజించినట్లు తెలుస్తోంది.మొదటి ప్రాధాన్యం గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి చైర్మన్ పదవులను ఇవ్వబోతున్నారు.
ఇక ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి పార్టీ కోసం కష్ట పడిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అలాగే మూడో ప్రాధాన్యంగా పార్టీ సీనియర్ లు గా ఉంటూ, ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇక డైరెక్టర్లలఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు సూచించిన వారికి డైరెక్టర్ పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ ఫార్ములాను ఉపయోగించడం ద్వారా పార్టీ లో కష్టపడి పనిచేసిన వారికి, టికెట్లు త్యాగం చేసిన వారికి సరైన న్యాయం జరుగుతుందని అభిప్రాయంతో జగన్ ఉన్నారట.ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో ఈ రోజు ఆ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉండడంతో వైసీపీ ఆశావాహుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇవేకాకుండా మరికొన్ని నామినేటెడ్ పదవులను పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి అప్పగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.