తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ పార్టీల ప్రధాన టార్గెట్ అంతా అధికార పార్టీ టిఆర్ఎస్ మాత్రమే.రెండు పార్టీలు విడివిడిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నాయి.
రకరకాల ఎత్తుగడలు వేస్తూ 2023 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ మేరకు రెండు పార్టీల అధిష్టానాలు తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించాయి.
సరిగ్గా ఇదే సమయంలో హుజురాబాద్ ఉప ఎన్నికల తంతు మొదలు కావడంతో, ఇక మరింత వేడి పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.దీనిలో భాగంగానే నిన్న కాంగ్రెస్, బిజెపిలు విడి విడి గా సమావేశాలు నిర్వహించారు.
కెసిఆర్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దళిత గిరిజన సభను గజ్వేల్ లో నిర్వహించారు.
అలాగే బిజెపి కూడా సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభను నిర్వహించింది.
దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభలు నిర్వహించాయి.అయితే కాంగ్రెస్ సభ కంటే బిజెపి సభకి మీడియా ఎక్కువ ఫోకస్ కల్పించింది.స్వయంగా ఈ సభకు హాజరు కావడంతో ఆయనకు ప్రాధాన్యం కల్పించారు.
ఇక బీజేపీ విషయానికి వస్తే అమిత్ షా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు పెద్ద ఎత్తున చేస్తారని అంతా అనుకున్నారు.కొద్ది రోజుల క్రితం కేంద్ర బీజేపీ పెద్దలను కేసీఆర్ కలవడం తదితర పరిణామాలతో దెబ్బతిన్న తెలంగాణ బిజెపి ఇమేజ్ ను అమిత్ షా పూరిస్తారు అని, అంతా అనుకున్నారు.
కానీ దీనికి భిన్నంగా అమిత్ షా టీఆర్ఎస్ పై విమర్శలు చేసే విషయంలో మొహమాట పడ్డారు.ఎక్కువగా ఆయన ఎంఐఎం ను విమర్శించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.రజకార్ల అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించి హైలెట్ చేసే ప్రయత్నం చేశారు.కానీ తెలంగాణ బిజెపి నాయకులు ఊహించినట్లుగా అయితే కేసీఆర్ , టీఆర్ఎస్ ల పై విమర్శల కోణం లో అమిత్ షా ప్రసంగం లేకపోవడంతో, తెలంగాణ బిజెపి నాయకులు ఉసురుమన్నారు.
ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, గజ్వేల్ సభకు మీడియా ఫోకస్ అంతగా లేకపోయినా, రేవంత్ మాత్రం తమ సభను సక్సెస్ అయ్యేలా చేసుకోవడంతో పాటు, దానికి తగిన ప్రచారం కూడా లభించేలా చేసుకున్నారు.ముఖ్యంగా బూత్ కు తొమ్మిది మంది అని టార్గెట్ పెట్టడంతో ఈ మేరకు భారీగానే జనాలు హాజరయ్యారు.
మీడియా ఫోకస్ తమ సభకు లేకపోయినా, సోషల్ మీడియా ద్వారా తమ సభ ను ట్రెండింగ్ లోకి తీసుకు రావడం లో రేవంత్ సక్సెస్ అయ్యారు.కెసిఆర్ పై నేరుగా విమర్శలు చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.
కానీ ఈ విషయంలో బీజేపీ ఫెయిల్ అయిందనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులలోనే కలిగింది.