తెలంగాణ బీజేపీలో మొన్నటి వరకు వర్గ పోరు అనేది కొంత మేరకు మాత్రమే కనిపించింది.కానీ ఇప్పుడు దాని ప్రభావం తారా స్థాయికి చేరినట్టు కనిపిస్తోంది.
రీసెంట్ గా బండి సంజయ్ పాదయాత్రను ప్రకటించిన సంగతి తెలసిందే.కాగా ఇదే క్రమంలోనే తాను కూడా ఆశీర్వాద యాత్ర చేయనున్నట్టు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు.
దీంతో ఒకే పార్టీ నుంచి ఇద్దరు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే బండి సంజయ్కు ఎక్కడ పేరు వస్తుందో అనే ఆలోచనతోనే కిషన్రెడ్డి కూడా పాదయాత్రను ప్రకటించారనే విమర్శలు వస్తున్నాయి.
ఇక బీజేపీలో వీరిద్దరి మధ్య మొదటి నుంచి వర్గ పోరు నడుస్తుందనే అనుమానాలకు ఇది మరింత బలం చేకూర్చింది.దీంతో ఇప్పుడు వీరిద్దరిలో ఎవరివైపు బీజేపీ నేతలు నిలుస్తారనే ఊహాగానాలు మిన్నంటాయి.
ఇక రీసెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, స్వామిగౌడ్, ఇతరత్రా పెద్ద నేతలందరూ కూడా బండి సంజయ్ పాదయాత్రకు మద్దతిస్తున్నట్టు ప్రకటించేశారు.ఏకంగా ప్రత్యేక పూజలు కూడా చేయిస్తూ పాదయాత్రను ఎక్కడి నుంచి ఎలా నిర్వహిస్తామనేది కూడా వివరాలు చెబుతున్నారు.
ఇక బండి పాదయాత్రను తామే దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటామని కూడా ప్రకటించేస్తున్నారు.
దీంతో వీరంతా కిషన్రెడ్డి పాదయాత్రకు హ్యాండ్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది అసలు మిగతా మంది కీలకంగా ఉంటున్న వారంతా కూడా బండికే మద్దతు ప్రకటిస్తారా లేదా అనేది కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది.ఇక పార్టీలో కీలకంగా ఉంటూ ప్రజల్లో కాస్త పట్టున్న నేతలంతా కూడా బండికే మద్దతు ఇస్తుండటంతో బీజేపీలో బండిదే పై చేయి అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి.ఇక కిషన్రెడ్డి పాదయాత్ర గురించి ఎవరైనా మాట్లాడుతారో లేదో అన్నది మాత్రం చూడాలి.
ఏదేమైనా మొన్నటి వరకు కాంగ్రెస్లో బయటపడ్డ వర్గ విభేదాలు కాస్తా ఇప్పుడు బీజేపీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.