వ్యక్తులకు విగ్రహాలు కట్టించడం, వారి పేర్ల మీద స్కూళ్ళకు , లేదంటే వీధులకు పేర్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం.సేవా కార్యక్రమాలు చేసినపుడో, లేదంటే ఏదన్నా ఘనత సాధించినపుడో ఆయా వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని సంధర్భాన్ని బట్టి ఇలా సత్కరించుకుంటాం.
వారికంటూ ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తాం.వేలాది మంది అభిమానించే వ్యక్తులకైతే ఏకంగా ఊరికి పేర్లు పెట్టుకుంటాం ఇవన్నీ మనం సహజంగా చూస్తూనే ఉంటాం.
అయితే దేశం కాని దేశంలో భారతీయులను అభిమానిస్తూ వారికి విగ్రహాలు, వీధులకు పేర్లు పెట్టడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది.
మహాత్మా గాంధీ, భగత్ సింగ్, ఇలాంటి కొందరు మహనీయులను విదేశాలలో చాలా ప్రాంతాలలో గౌరవించుకుంటున్న ఘటనలు మనకు తెలిసినవే.
అయితే ఓ సాధారణ భారతీయ మహిళను అమెరికాలోని ఓ ప్రాంతం గౌరవించుకోవడమే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ కు ఆమె పేరు పెట్టుకోవడం అందరిని ఆకట్టుకుంది.సోషల్ మీడియాలో సదరు స్కూల్ ఈ విషయం పంచుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ మహిళపై పడింది.
ఆమె ఎవరు.?? ఎందుకు అక్కడి స్కూల్ కు ఆమె పేరు పెట్టారు.అంతగా వారు ఆమెను అభిమానించడానికి కారణం ఏంటి.?? అంటే.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 53 వ ఎలిమెంటరీ స్కూల్ కు భారత్ నుంచీ అమెరికా వలస వెళ్ళిన సోనాల్ భూచర్ పేరు పెట్టనున్నారు.ఈ మేరకు ది ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఏకంగా తీర్మానమే చేసింది.ఆమె పేరును పెట్టడానికి కారణం ఏంటంటే.1985 లో తన భర్త తో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు సోనాల్ భూచర్.సహజంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు అయిన ఆమె అమెరికాలో కూడా సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు.ముఖ్యంగా విద్యార్ధుల కోసం ఆమె చేయని సేవ లేదు, ఎన్నో కార్యక్రమాలకు నాయకత్వం వహించి ముందుకు నడిపించారు.
ఆమె సేవలను స్థానిక ప్రభుత్వాలు కూడా గుర్తించి గౌరవించుకున్నాయి కూడా.అయితే ఊహించని విధంగా ఆమె 2019 లో క్యాన్సర్ తో 58 ఏట మృతి చెందారు.
ఆమె మృతిని విద్యార్ధులు, స్థానిక స్కూల్స్ కూడా జీర్ణించుకోలేక పోయాయి.అయితే త్వరలో ఏర్పాటు చేయనున్న తమ స్కూల్ కు ఆమె పేరును పెడుతున్నట్టుగా ది ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ ప్రకటించింది.
సోనాల్ భూచర్ ను ఈ విధంగా గౌరవించుకోవడం పై కుటుంభ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.