అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టినట్లుగా వుంది.ఇప్పటికే ఇడా హరికేను సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే మళ్లీ ఇప్పుడు కొత్తగా నికోలస్ పడగ విప్పేందుకు సిద్ధమైంది.
ఇడా ధాటికి లూసియానా, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వేల కోట్ల ఆస్తి నష్టంతో పాటు దాదాపు 114 మంది వరదలు, తుఫాన్ కారణంగా మరణించారు.
అనధికారికంగా ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.ఇక ఉష్ణమండల తుఫానుగా ప్రారంభమైన నికోలస్.
సోమవారం నాటికి హరికేన్గా బలపడి టెక్సాస్ రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది.టెక్సాస్ గల్ఫ్ తీరంపై విరుచుకుపడేందేకు వేగంగా కదులుతున్న నికోలస్ను అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ కేటగిరీ 1 హరికేన్గా ప్రకటించింది.
దీని కారణంగా మెక్సికో నుంచి లూసియానా వరకు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.
సోమవారం తర్వాత ఎగువ టెక్సాస్ గల్ఫ్ కోస్ట్లోని మాతగోర్డాబే దిశగా నికోలస్ కదులుతుందని, ఆ తర్వాత ఆగ్నేయ టెక్సాస్ తీరం వెంబడి పయనిస్తుందని మియామిలోని వెదర్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.సోమవారం నాటికి టెక్సాస్లోని ఫ్రీపోర్ట్కు నైరుతి దిశలో దాదాపు 45 మైళ్ల దూరంలో నికోలస్ కేంద్రీకృతమై వుంది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టెక్సాస్ గవర్నర్ గ్రెట్ అబాట్ తక్షణం స్పందించారు.అధికారులను అప్రమత్తం చేసిన ఆయన.హ్యూస్టన్తో పాటు తీర ప్రాంతంలో రెస్క్యూ బృందాలు, అవసరమైన వనరులు సిద్ధంగా వున్నట్లు తెలిపారు.మంగళవారం హ్యూస్టన్లో పరిస్ధితి దారుణంగా మారుతుందని.
భారీ వర్షంతో పాటు వరదలు పోటెత్తి ఇళ్లు మునిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ నేపథ్యంలోనే నగరమంతటా హై వాటర్ రెస్క్యూ వాహనాలను మోహరించారు.అలాగే వరదలు సంభవించే అవకాశం వున్న ప్రాంతాలను గుర్తించి.40కి పైగా బారికేడ్లను ఏర్పాట్లు చేసినట్లు హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ చెప్పారు.
గడిచిన సంవత్సరాలలో హ్యూస్టన్లో విధ్వంసం సృష్టించిన పలు తుఫాన్లను టర్నర్ గుర్తుచేసుకున్నారు.ఇటీవలి కాలంలో అత్యంత తీవ్రమైనదిగా పేర్కొన్న హర్వే తుఫాన్ వల్ల నగరంలో 1,50,000కు పైగా గృహాలకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.అలాగే కనీసం 68 వరకు ప్రాణాలు కోల్పోయారని టర్నర్ వెల్లడించారు.నికోలస్ హరికేన్ నేపథ్యంలో టర్నర్, హారిస్ కౌంటి న్యాయమూర్తి లీనా హిడాల్గో సోమవారం సాయంత్రం నగరవాసులను అప్రమత్తం చేశారు.
వరద నీరు ప్రవహిస్తున్న రహదారులను ఉపయోగించకుండా వుండటం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇక హరికేన్ నేపథ్యంలో టెక్సాస్ రాష్ట్రంలోనే అతిపెద్దదైన హ్యూస్టన్ పాఠశాల మంగళవారం తరగతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ సెంటర్లను మూసివేసింది.హరికేన్ ప్రభావం వల్ల ఎగువ టెక్సాస్ తీరం వెంబడి దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.