భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.
దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.
ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.
దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దీవాళీని జరుపుకుంటున్నారు.
ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్హౌస్లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.
ఇక అమెరికా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన యూఎస్ కాంగ్రెస్లో దీపావళిని గతవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో పనిచేస్తున్న వారు, మరికొందరు భారత సంతతి ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తన నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.డౌన్టౌన్ ఆస్టిన్లోని చారిత్రాత్మకమైన గవర్నర్ మాన్షన్లో ఈ వేడుకలు జరిగాయి.గడిచిన ఆరేళ్లుగా టెక్సాస్ గవర్నర్ అధికారికంగా దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.అయితే గతేడాది కోవిడ్ కారణంగా వేడుకలు జరగలేదు.దీపావళి వేడుకల్లొ పాల్గొన్న తొలి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాటే కావడం విశేషం.ఇక ఈ ఏడాదికి వస్తే.
సంప్రదాయ నెహ్రూ జాకెట్ను ధరించిన గవర్నర్ అబాట్.తన సతీమణి సిసిలియా అబాట్తో కలిసి భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రముఖులను తన ఇంటికి ఆహ్వానించారు.
వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి… అనంతరం వారి సమక్షంలో దీపాన్ని వెలిగించారు.
డల్లాస్కు చెందిన హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ నెక్స్ట్ సీఈవో అరుణ్ అగర్వాల్… గవర్నర్ దంపతులకు ఏనుగు బొమ్మలను బహుమతిగా అందించారు.
అలాగే టెక్సాస్లోని భారతీయ అమెరికన్ సమాజంతో గవర్నర్కు వున్న స్నేహాన్ని ప్రశంసించారు.టెక్సాస్ ప్రస్తుతం భారత్కు వివిధ వస్తువులను ఎగుమతి చేసే రెండవ అతిపెద్ద రాష్ట్రంగా.
అలాగే అమెరికాలో భారతీయ వస్తువులను దిగుమతి చేసుకునే రాష్ట్రాలలో నాలుగో రాష్ట్రంగా వుంది.ఇక ఈ కార్యక్రమానికి మిడ్లాండ్కు చెందిన డాక్టర్ మనోహర్ గుర్రు, ఆండ్రూస్కు చెందిన డాక్టర్ సతీశ్ నాయక్, ఆర్లింగ్టన్కు చెందిన డాక్టర్ దీపక్ చావ్డా, హ్యూస్టన్కు చెందిన డాక్టర్ రాజేశ్ తదితరులు హాజరయ్యారు.