రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.ఈ విషయం ముందుగానే ఊహించింది.
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి ఈ నలుగురు రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఈ నలుగురిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ఇద్దరు ఏపీ మంత్రులు గా ఉన్నారు.
వీరు ఇప్పుడు రాజ్యసభకు ఎన్నిక కావడంతో తమ మంత్రి పదవులకు తప్పనిసరిగా రాజీనామా చేయాలి.ఈ నేపథ్యంలో వీరి స్థానంలో జగన్ ఎవరిని నియమిస్తారు అనే ఉత్కంఠ ఇప్పుడు పార్టీలో నెలకొంది.
దీంతో పాటు పనితీరు సక్రమంగా లేని మరికొంత మంది మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తగా మరి కొంతమందిని తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.దీంతో పెద్ద ఎత్తున మంత్రి పదవి దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా మరో ప్రచారం జరుగుతోంది.అలా కుదరని పక్షంలో అదే జిల్లాలకు చెందిన వారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.
వీరితో పాటు కొత్తగా మంత్రివర్గ విస్తరణ చేపడితే, తమకు అవకాశం దక్కుతుందని పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.కొలుసు పార్థసారథి, ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, ముదునూరి ప్రసాద్ రాజు, వీరే కాకుండా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఆశించే లిస్ట్ కనిపిస్తున్నారు.
మొదటి విడత మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రస్తుతం మంత్రులు రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కొత్తవారిని నియమిస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న మంత్రులను 80 శాతం వరకు తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పడంతో మొదటి విడతలో అవకాశం దక్కించుకున్న వారు రెండో విడతలో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.
కానీ అనూహ్యంగా ఇప్పుడు రెండు మంత్రి పదవులు ఖాళీ ఏర్పడడం, కొంతమంది పని తీరుపై తీవ్ర అసంతృప్తి ఉండడంతో జగన్ తప్పనిసరిగా క్యాబినెట్ విస్తరణ లో మార్పుచేర్పులు చేస్తారని ఎవరికివారు ఆశలు పెట్టుకున్నారు.
కాకపోతే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ఇద్దరూ మరో ఆరు నెలల పాటు మంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఉండడంతో మరికొంత సమయం మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ? ఎవరిని తప్పించాలని అనే విషయంలో ఇప్పటికే జగన్ ఒక లిస్టు తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది.