తెలంగాణలో మంత్రులకు వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి.కొద్ది రోజుల వరకు టీఆర్ఎస్కు ఓటమి అనేదే తెలియదు.
అయితే వరుస పెట్టి ఆ పార్టీ ఓటములతో విలవిల్లాడుతోంది.గత యేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని 9 సీట్లకు పరిమితం అయ్యింది.
అప్పటి నుంచి కారు పార్టీకి కష్టాలు ఎదురవుతున్నాయి.ఆ తర్వాత స్థానిక ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినా దుబ్బాక దెబ్బతో కారు క్రేజ్ దుబ్బు దుబ్బు అయిపోయింది.
ఇక ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా అధికారానికి దూరం అయిపోయింది.గత ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ మొన్న ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధిస్తామని బీరాలు పోయి చివరకు 60 లోపు సీట్లతో సరిపెట్టుకుంది.
బీజేపీ ఎవ్వరూ ఊహించని విధంగా 50 సీట్లకు దగ్గరైంది.గ్రేటర్ ఎన్నికల్లో మంత్రులు ఫెయిల్ అవ్వడంతో వీరిపై కేసీఆర్ వేటు వేసేస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు అంటేనే మంత్రులు భయపడుతున్నారు.
ప్రస్తుతం మంత్రి జగదీశ్ రెడ్డికి గుబులు మొదలైన పరిస్థితి.జగదీశ్ రెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడే.అయితే నాగార్జునా సాగర్ ఉప ఎన్నికను గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపైనే ఉంది.
కొంత కాలం క్రితం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించడంతో కేసీఆర్ దగ్గర ఆయన భారీ క్రెడిట్ కొట్టేశారు.అయితే ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో జగదీశ్కు కేసీఆర్ ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వగా ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా గెలవలేదు.
ఇక ఇప్పుడు నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ దగ్గర జగదీశ్ రెడ్డిని కేసీఆర్ పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.దీంతో జగదీశ్లో గుబులు మొదలైందనే అంటున్నారు.
జగదీష్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అంటేనే హడలి పోతున్నారట.