రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఉంది.ప్రభుత్వ ప్రతిష్టను అప్రదిష్టపాలు చేశారనే అభియోగాలపై ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, తమ కస్టడీలోకి ఆయన ను తీసుకున్నారు.
అయితే ఆ సమయంలో రఘురామకృష్ణం రాజును సిఐడి పోలీసులు కొట్టారనే అభియోగాలు వచ్చాయి.రఘురామకృష్ణంరాజు పాదాలు కమిలిపోయి ఉండడం, పోలీసులు ముసుగేసుకుని మరి తనను కొట్టారంటూ ఆయన ఆరోపణలు చేశారు.
అయితే అవి కొట్టిన దెబ్బలు కావు అని, రఘురామకృష్ణంరాజు కు ఉన్న చర్మ వ్యాధి కారణంగానే కాళ్లు ఎర్రబడ్డాయి అంటూ గుంటూరు ఆస్పత్రిలో రిపోర్టు రావడం, అవి కొట్టిన గాయాలు కాదు అని, ఆయన శరీరంపై ఎటువంటి దెబ్బలు లేవని నివేదిక రావడంతో దీనిపై సుప్రీంకోర్టు వరకు రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు వెళ్లడం, అసలు నిజం ఏమిటో తేల్చాలని సుప్రీంకోర్టు భావించడంతో పాటు సికింద్రాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో తమకు అందించాలని కోర్టు ఆదేశించింది.దీనికి తగ్గట్టుగానే నిన్న ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ నివేదిక సుప్రీం కోర్టుకు చేరింది అయితే దీనిపై మరో రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టు స్పందించబోతున్న నేపథ్యంలో అసలు సీల్డ్ కవర్ లో ఏముంది అనే టెన్షన్ ఇటు అధికార పార్టీ , అటు ప్రతిపక్షాలకూ నెలకొంది. ప్రభుత్వం మాత్రం తాము రఘురామకృష్ణంరాజు ఎటువంటి దాడి చేయలేదని, ఇదంతా ఆయన కావాలని ఆడుతున్న నాటకమని , బెయిల్ రాకపోవడంతో ఈ విధమైన ఎత్తుగడ వేశారని చెబుతోంది.
అయితే రఘురామకృష్ణమారాజు తరపు వారు, ప్రతిపక్షాలు మాత్రం ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఆయనను కొట్టారని బలంగా నమ్ముతూ ఉండడం, సుప్రీం కోర్టు దీనిపై స్పందించబోతున్న నేపథ్యంలో తీర్పు ఏవిధంగా వస్తుందనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఒకవేళ కొట్టలేదు అని గనుక ఆర్మీ ఆసుపత్రి రిపోర్టుల్లో తేలితే , రఘురామకృష్ణంరాజు కు కోర్టు ఎటువంటి శిక్ష వేస్తుంది ? ఒకవేళ కొట్టిన గాయాలు ఉన్నట్లు తేలితే ఏపీ సిఐడి పోలీసులు పై ఎటువంటి చర్యలు సుప్రీంకోర్టు తీసుకుంటుంది అనే చర్చ జరుగుతోంది.ఇక సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించి చాలానే ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.ఈ కేసులో తీర్పు వచ్చే వరకు ఇదే టెన్షన్ కొనసాగేలా కనిపిస్తోంది.
.