కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.అన్ని పార్టీల నాయకులకు గేలం వేస్తూ బలపడి వచ్చే ఎన్నికల నాటికైనా పదుల సంఖ్యలో సీట్లు సాధించాలని చూస్తోంది.
బీజేపీ ద్రుష్టి కేవలం ఏపీ మీదే కాదు, దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బలపడాలని చూస్తోంది.అయితే కేవలం నాయకుల వలసల మీదే ఆధారపడ్డ బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ తప్పిదంగా కనిపిస్తోంది.
ఆ పార్టీ అగ్ర నాయకులు నేల విడిచి సాము చేస్తున్నట్టుగా బీజేపీ నాయకులు ఏపీలో వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.వాస్తవంగా చూసుకుంటే ఏపీలో బీజేపీ కి అంత ఆదరణ లేదు.
ప్రాంతీయ పార్టీలైన టీడీపీకి, ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాదరణతో పోల్చుకుంటే బీజేపీ బాగా వెనకబడి ఉంది.
అసలు ఏపీలో క్షేత్రస్థాయిలో బీజేపీ సిద్ధాంతాలను, వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు కరువయ్యారు.
అసలు ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏదీ కూడా ముందుకు సాగలేదు.పైగా దీనిపై ఇప్పటి వరకు నాయకులు దృష్టి కూడా పెట్టలేదు.
అయితే, ఏపీలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి రానున్న రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్న్యాయంగా బీజేపీని తీర్చిదిద్దాలని ఆ పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నారు.దేశంలో జాతీయ పార్టీగా ఎక్కడైనా ఎదిగేందుకు, ఏ రాష్ట్రంలో అయినా అధికా రంలోకి వచ్చేందుకు కూడా ప్రయత్నించడం తప్పుకాదు.
అయితే, ఇలా ఎదిగే క్రమంలో.వేస్తున్న అడుగులు విమర్శలకు కారణం అవుతోంది.
ఏపీలో క్షేత్రస్థాయిలో ఎదిగి, కార్యకర్తలను కూడగట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగితే బీజేపీ మీద ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు.కానీ, టీడీపీ తరఫున ఎన్నికైన వారిని, లేదా ప్రతిపక్షాల నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే అది నిజంగా తప్పిదమే.నిజానికి నాయకులు రాజకీయాలను, ప్రభుత్వాలను నిర్ణయిస్తారనుకుంటే, చాలా పొరపాటు.ప్రజలను తక్కువగా అంచనా వేసినట్టే అవుతుంది.ఇదే రూట్లో బీజేపీ కనుక ముందుకు వెళితే ఏపీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ పార్టీకి కేవలం నాయకులు మాత్రమే మిగులుతారు తప్ప కార్యకర్తలు తయారవ్వరు.అలాగే ప్రజల నుంచి ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అనడంలో సందేహంలేదు.