గులాబీ సినిమాలో “ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు” అనే సైలెంట్ మెలోడీ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సింగర్ సునీత” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో ప్రేక్షకులను మైమరిపింజేసిన సింగర్ సునీత తన సినీ కెరీర్లో చాలా కష్టాలను ఎదుర్కొంది.
ఒకానొక సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమా పరిశ్రమకు దూరమై మళ్ళి తన పాటలతో అలరించడానికి సిద్ధమైంది. అయితే తాజాగా సింగర్ సునీత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో సినీ సంగీత పరిశ్రమ గురించి బయట వినిపిస్తున్నంత దారుణ పరిస్థితులు ఏమీ లేవని ఎవరో కొంతమంది చేసేటటువంటి పనులను బట్టి మొత్తం అందరిని నిందించడం సరికాదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేగాక తనకి ఇతరుల పట్ల అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి నుంచి దూరంగా వెళ్ళిపోతానని ఈ కారణంగా చాలా సినిమాలలో పాటలు పాడే అవకాశాలు దూరం చేసుకున్నానని చెప్పుకొచ్చింది.
అయితే ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో సమస్యలు ఉంటాయని కాబట్టి వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి తప్ప ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తే అలుసై పోతామని ఆ విషయాన్ని తాను బాగా నమ్ముతానని తెలిపింది. అంతేగాక సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కున్న పరిస్థితుల కారణంగా ఒకానొక సమయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉద్యోగం చేద్దామని కూడా అనుకున్నానని కానీ నా జీతం డబ్బులతో నా కుటుంబాన్ని పోషించలేనని అందువల్లనే ఇప్పటివరకు సినిమా పరిశ్రమలో కొనసాగుతూ వస్తున్నానని తన మనసులో మాటను బయట పెట్టింది.
ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో సింగర్ సునీత కు పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించింది.కాగా ప్రస్తుతం సింగర్ సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉన్నట్లు సమాచారం.