తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయినటువంటి జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే మొగలి రేకులు సీరియల్ ఇప్పటికీ బుల్లితెర సినీ ప్రేక్షకులకి గుర్తుంటుంది. అయితే ఈ సీరియల్ లో నటించినటువంటి నటీనటులు ఆర్కే నాయుడు, శాంతి కూడా బాగానే గుర్తుంటారు.
కాగా ఈ సీరియల్ లో శాంతి పాత్ర నటించినటువంటి ప్రముఖ టీవీ సీరియల్ నటి “షీలా సింగ్” తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్న పలు సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
ఇందులో భాగంగా తాను మొగలి రేకులు ధారావాహికలో నటించడానికంటే ముందు బొమ్మరిల్లు, మా ఇంటి ఆడపడుచు, సొగసు చూడతరమా, శిఖరం, తదితర సీరియళ్లలో నటించానని చెప్పుకొచ్చింది.
కానీ తనకు బుల్లితెర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చింది మాత్రం మొగలి రేకులు సీరియల్ అని తెలిపింది. అలాగే తాను సీరియల్ లో నటించే సమయంలో పలు సినిమాలలో కూడా నటించానని, కానీ తాను నటించిన చిత్రాలలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చింది.
కాగా తాను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “ధైర్యం” చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించానని దీంతో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తల్లి కూడా తనతో పాటు షూటింగ్ సెట్స్ కి వచ్చేదని తెలిపింది.
అయితే ఓ రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో భోజనం చేద్దామని ప్లేట్ తీసుకుని వెళుతుంటే ప్రొడక్షన్ కి సంబంధించిన ఓ వ్యక్తి మీలాంటి వాళ్ళు స్టార్ లతో కలిసి భోజనం చేయకూడదని మీరు భోజనం చేసే చోటు వేరే ఉందంటూ చేతిలో నుంచి ప్లేటు లాగేసుకుని ప్రక్కకి పంపించాడట.
దీంతో ఇది చూసినటువంటి డైరెక్టర్ తేజ వెంటనే ఆ ప్రొడక్షన్ వ్యక్తిని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. అంతేగాక షీలా సింగ్ ని తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయించాడని ఈ విషయం తన సినీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని షీలా సింగ్ తెలిపింది.
అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో తన తల్లి కూడా అక్కడే ఉందని, తన తల్లి ముందే ఇంతటి అవమానాన్ని ఎదుర్కొన్నందుకుగానూ తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు సినీ జీవితంలో ఒక్కోసారి ఇలాంటి అవమానాలు తప్పవని కాబట్టి పెద్దగా పట్టించుకోవద్దని చెప్పటంతో మళ్లీ సీరియళ్లలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపింది.కాగా ప్రస్తుతం షీలా సింగ్ తమిళంలో పలు ధారావాహికలలో నటిస్తోంది.