విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవాలని, చదువు పూర్తవగానే అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఎంతో మంది విద్యార్ధులు కలలు కంటుంటారు.చాలా మంది విద్యార్ధులు ఈ కలను సాకారం చేసుకుంటుంటారు.
మరి కొందరు మాత్రం ఉద్యోగం మాట దేవుడెరుగు అసలు విదేశాలు వెళ్లేందుకు వీసా వస్తే చాలు అనుకుంటారు.ఇక కొందరైతే ఎలాగోలా ఏం చేసైనా సరే వీసా సాధించాలని అడ్డ దారులు తొక్కుతుంటారు.
అయితే అడ్డ దారులలో వెళ్ళే వారికి ఏదో ఒక చోట తప్పకుండా కాలం ఎదురు తిరుగుతుంది, తాము కన్న కలలు కేవలం ఒక చిన్న తప్పు కారణంగా చెదిరిపోతే ఆ పరిణామం జీవితాంతం బాధిస్తుంది.వివరాలలోకి వెళ్తే…
వీసాలు త్వరగా వచ్చేయాలని, విదేశాలలో చదువుకోవాలని ఆశ పడటంలో తప్పులేదు, కానీ అడ్డ దారుల్లో వీసా పొందాలనుకోవడం మాత్రం విపరీత పరిణామాలకు దారి తీస్తుంది.
విదేశాలలో విద్య కోసం ప్రతీ ఏటా లక్షలాది అప్లికేషన్స్ భారత్ నుంచీ వివిధ దేశాలకు వెళ్తుంటాయి.ఇలా వెళ్ళిన అప్లికేషన్స్ లో చాలా వరకూ రిజక్ట్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంటాయి.
అసలు ఈ విద్యార్ధి వీసాలు ఎందుకు తిరస్కరించబడుతున్నాయి, ప్రతీ ఏటా వేలాది వీసాలు ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయంటే.
వీసా పొందటమే తమ టార్గెట్ గా భావించే విద్యార్ధులు నకిలీ సర్టిఫికేట్ లు, బ్యాంక్ స్టేట్మెంట్ లతో వీసాలకు అప్లై చేస్తున్నారు.కానీ ఇమ్మిగ్రేషన్ సందర్భంగా అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.ఇలా ప్రతీ ఏటా వేలాది వీసా అప్లికేషన్స్ రిజక్ట్ అవుతున్నాయట.
ముఖ్యంగా భారత్ లోని పంజాబ్ , హర్యానా ఈ రెండు రాష్ట్రాల నుంచీ తరహా మోస పూరిత వీసా అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని ఆయా దేశాల ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.ఆస్టేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల నుంచీ 2020 -21 కాలంలో సుమారు 600 మందికి పైగా విద్యార్ధులు ఈ తరహా మోసాలు చేస్తూ పట్టుబడ్డారట.
అంతేకాదు కెనడాలో సైతం ఇదే తరహాలో మోసాలు జరిగాయని 2021 ఏడాదిలో సుమారు 92 వేల వీసా అభ్యర్ధనలు తిరస్కరించబడ్డాయని కెనడా ఇమ్మిగ్రేషన్ తెలిపింది.