ఆత్మకూరు(ఎస్)లో బీజేపీ ప్లెక్సీలు చించిన దుండగులు

ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చింపివేశారు.

మొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంకినేని వెంకటేశ్వరరావు రావడానికి ఒకరోజు ముందే బీజేపీ ఫ్లెక్సీలు చించిన ఘటన మరువక ముందే మళ్ళీ ఫ్లెక్సీలను చించివేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలోనే ఫ్లెక్సీలను చించినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

కానీ,పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయడంతో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు.

తమకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగే పరిస్థితి లేకపోవడంతోనే తమ నేత సంకినేని వెంకటేశ్వరరావు మా పార్టీ కార్యక్రమాలపై, నాయకులపై చేస్తున్న దాడులను ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారన్నారు.

గతంలో చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాయని,కానీ,ఏనాడు ప్రతిపక్ష పార్టీలపై ఇంత కక్షపూరితంగా వ్యవహరించిన సంస్కృతి లేదన్నారు.

ఇలాంటి చర్యలపై సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.