తుది అంకానికి బ్రిటన్ ప్రధాని ఎన్నిక : ప్రచారం ముగించిన రిషి.. భార్య, తల్లిదండ్రులకు థ్యాంక్స్

యూకే ప్రధాని ఎన్నిక తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే.మరికొన్ని రోజుల్లో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారు.

ఇందుకోసం లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.తొలుత తన పోటీదారులను ఒక్కొక్కరిగా ఓడిస్తూ టాప్‌లో నిలిచిన రిషి సునాక్ చివరి దశలో మాత్రం లిజ్ ట్రస్‌ ముందు తేలిపోతున్నారు.

మెజార్టీ సర్వేలన్నీ బ్రిటన్‌కు కాబోయే ప్రధాని లిజ్ ట్రస్సేనని చెబుతున్నాయి.కానీ రిషి మాత్రం చివరి వరకు వేచి చూద్దామని తన మద్ధతుదారులతో అంటున్నారు.

ఈ నేపథ్యంలో రిషి సునాక్ తన ప్రచారాన్ని ముగించారు.తన తల్లిదండ్రులు, భార్య అక్షతా మూర్తి సలహా మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం రాత్రి లండన్‌లోని వెంబ్లీలో ఓ సమావేశంలో రిషి సునాక్ మాట్లాడుతూ.ప్రజా సేవలో ప్రవేశించడానికి తనను ప్రేరేపించిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడే వున్నారని వాళ్లే తన తల్లిదండ్రులని ఆయన చెప్పారు.

ఆ వెంటనే కెమెరాలు రిషి తండ్రి యష్‌వీర్, తల్లి ఉషాల వైపు తిరిగాయి.

కోడలు అక్షతతో కలిసి వారిద్దరూ కూర్చున్నారు.ప్రజల కోసం వారు చేసిన పనులే తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయని రిషి తెలిపారు.

కృషి, నమ్మకం, కుటుంబ ప్రేమతో ఎవరైనా ఏమైనా సాధించవచ్చని వారు తనకు నేర్పించారని రిషి సునాక్ ప్రశంసించారు.

అలాగే తన భార్య అక్షతను చూస్తూస్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన తమ ప్రేమ కథను ప్రస్తావించారు.

తనకు భార్యాపిల్లలంటే ఎంతో ప్రేమ కానీ దురదృష్టవశాత్తూ గత కొన్నేళ్లుగా తాను వారి జీవితాల్లో ఉండలేకపోయానని రిషి ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చగలనని తాను భావిస్తున్నట్లు సునాక్ అన్నారు. """/"/ ఇకపోతే.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని ఎన్నికపై కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ ముగుస్తుంది.

దాదాపు 1,60,000 మంది టోరీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు.

లిజ్ ట్రస్‌వైపే సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నప్పటికీ రిషి సునాక్‌ను అంత తేలిగ్గా అంచనా వేయొద్దని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే ఆయనకు అనుకూలంగా బ్రిటన్‌లోని భారతీయులు పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.సోమవారం సాయంత్రం నాటికి బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరో తేలిపోనుంది.