ప్రాణం తీసిన అతివేగం.. చెట్టును బైకు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం

హన్మాజీపేటలో పండుగ పూట రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా :ద్విచక్ర వాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరి యువకులు దుర్మరణం చెందిన విషాద సంఘటన వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన విక్కుర్తి దిలీప్ (22) సురా అనిల్ (21) అనే ఇద్దరు స్నేహితులు గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అప్పటివరకు ఎంతో సంతోషంగా వున్న ఇద్దరు మిత్రులు దుర్గామాత నిమజ్జనం తర్వాత నూతనంగా కొనుగోలు చేసిన బైకుపై సరదాగా మామిడిపల్లి రహదారి వైపు వెళ్లారు.

అతివేగంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించిన స్పందించకపోవడంతో అటువైపుగా పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు క్షతగాత్రులను తమ వాహనంలోనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పెద్ద ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.

మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరి యువకులు అర్థాంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల రోదనలతో హన్మాజీపేట గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

రతన్ టాటా కొన్న ఈ రిస్ట్ వాచ్ ధర ఎంతో తెలిస్తే..