టిఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నన్నపునేని నరేందర్ పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను అవమానించే విధంగా మగ్గంపై కాళ్ళు పెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

ఈ ర్యాలీలో డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేతన్నలను,బిసిలను అవమానించిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ పార్టీ నాయకులకు బిసిలపై చిన్నచూపు ఉందన్నారు.గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశాలీలను గొట్టంగాల్లు,పప్పుచారు అన్నారని గుర్తుచేశారు.

అదేవిధంగా నల్గొండకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి బిసి వర్గానికి చెందిన నర్సయ్య గౌడ్ ను ఉద్దేశించి బూరెలు గారెలతో ఏం కాదని అవమానించారని మండిపడ్డారు.

కులాల వారిగా ఆత్మగౌరవ సమ్మేళనాలు పెట్టి గౌరవించినట్లుగా నటించి, బయట మాత్రం దారుణంగా అవమానపరుస్తున్నారని తెలిపారు.

అందుకే బిసిలను అవమానించిన పార్టీని,నాయకులను మునుగోడు బహుజనులంతా ఏకమై చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఈ రోజు మన్నెగూడలో కురుమ, యాదవ ఆత్మీయ సమ్మేళనం పెట్టి అన్నం తినేందుకు ప్లేట్ కూడా ఇవ్వకుండా,టిఆర్ఎస్ కరపత్రాలపై,అట్టపెట్టెలపై అన్నం పెట్టి అవమానించారని మండిపడ్డారు.

అందుకే మునుగోడులో మీ దొరల అహంకారాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు.మరోపక్క బిజెపి బిసిల కులగణన చేయకుండా మోసం చేయడమే కాక,నేతన్నలపై జిఎస్టి భారం మోపారని విమర్శించారు.

అనంతరం మర్రిగూడలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.మర్రిగూడ మండలంలోని చర్లగూడం ప్రజలను మోసం చేసి వేల ఎకరాల భూములను గుంజుకొని ప్రజలను నిరాశ్రయులను చేశారని విమర్శించారు.

మర్రిగూడలో ఆరోగ్య వసతులు కల్పించకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

ప్రసూతి వార్డులకు పాములు వస్తుంటే,చనిపోయిన శవాల పేరుమీద లక్షల బిల్లులు తీసుకుంటుంటే ఆరోగ్య శాఖ మంత్రి నోరుమెదపడం లేదన్నారు.

ఒక చిన్న ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి రావడం సిగ్గుచేటన్నారు.ఓటమిని ఒప్పుకున్నట్లేనని తెలిపారు.

మునుగోడులో ఎన్నికల విధానం సజావుగా సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు.గుర్తుల విషయంలో ఆర్వో అధికారిని మార్చడం, సమయానికి సమాచారం ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వివరాలు తెలపకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.ఎలాంటి అన్యాయం,అపనమ్మకం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అభ్యర్థి శంకరాచారి,జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,జిల్లా నాయకులు పల్లేటి రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన జానీ మాస్టర్… ఆయన రియాక్షన్ ఇదే?