గ్రామాభివృద్ధిలో ప్రత్యేక అధికారుల పాత్ర శూన్యం

నల్లగొండ జిల్లా:జనవరి 30 తో గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో ఇప్పట్లో పంచాయితీ ఎన్నికల పెట్టే ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పాలనా వ్యవహారాలు చక్కబెట్టెందుకు ప్రత్యేక అధికారుల విధానాన్ని తెరపైకి తెచ్చి,రెండు,మూడు పంచాయితీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించింది.

కొందరు సర్పంచ్ లు ఇంతకాలం లోకల్ పాలిటిక్స్ తో అభివృద్ధికి అవసరమైన పనులు చేయలేక,చేసినా బిల్లులు వస్తాయో లేదోనని రకరకాల కారణాలతో తాము ఇబ్బంది పడుతూ ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేశారు.

ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చాక ఎలాంటి వివక్ష లేకుండా గ్రామాలు అభివుద్ది బాట పడతాయని అందరూ భావించారు.

కానీ,ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల అభివృద్దిలో,ప్రజా సమస్యల పరిష్కారంలో స్పెషల్ ఆఫీసర్ల మార్క్ ఎక్కడా కనిపించడం లేదని,వారు గ్రామాలకు వచ్చేది లేదు, వచ్చినా చేసేదేమీ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మండల స్థాయిలో బిజీగా ఉంటూ,గ్రామ పాలనపై కనీస అవగాహన లేని వివిధ హోదాల్లో ఉన్న అధికారులను రెండు,మూడు గ్రామాలకు స్పెషల్ అధికారిగా నియమించడం వల్ల వారి వారి విధులు నిర్వహిస్తూ గ్రామాల మీద సరైన దృష్టి సారించలేకపోవడంతో పంచాయితీల పాలన పూర్తిగా కుంటుపడిందని ప్రజలు వాపోతున్నారు.

గ్రామాభివృద్ధి మరియు స్థానిక ప్రజా సమస్యలపై ప్రత్యేక అధికారికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని,ఏదడిగినా కార్యదర్శికి చెప్పండని సమాధానం వస్తుందని,దీనితో కార్యదర్శులే అన్ని తామై నడిపిస్తున్నారని,ఈ మాత్రం దానికి స్పెషల్ ఆఫీసర్ దేనికని ప్రశ్నిస్తున్నారు.

మండల స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించడం ద్వారా వారి అసలు పనిపై దృష్టి పెట్టలేక, గ్రామాల సమస్యలపై ఫోకస్ చేయలేక పనిభారంతో ఇబ్బంది పడుతూ రెంటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిందని పలువురు అధికారులు ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ కనుచూపు మేరలో కనిపించడం లేదు.

పంచాయితీ పాలన ఇలాగే కొనసాగితే గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంతగా పని భారం లేని అధికారులను గుర్తించి,వారికి గ్రామాల పట్ల కనీస అవగాహన కల్పించి, స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తే కొంతమేరకు ఉపయుక్తంగా ఉంటుందని,లేదంటే గ్రామ కార్యదర్శులకే పూర్తి స్థాయి అధికారిగా బాధ్యతలు అప్పగించి,మండల స్థాయి అధికారి జాయింట్ చెక్ పవర్ తో పర్యవేక్షణ చేయిస్తూ పంచాయతీలను,ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, శనివారం 2024