ఆ వివాదంపై ‘నీళ్లు ‘ జల్లేస్తారా ? కత్తులు దూస్తారా ?

కలహాలతో ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం నిత్యం వివాదాలు పెట్టుకునే కంటే, కలిసి సామరస్యపూర్వకంగా, అన్ని వివాదాలను పరిష్కరించుకుని ముందుకు వెళ్తే, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని, అలాగే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం సహకరించుకుంటూ, అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్లే విధంగా చేయవచ్చు అనే అభిప్రాయం లో ఉంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్.

ఇద్దరి ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు కావడంతో, వీరి మధ్య స్నేహం మరింతగా చిగురించడానికి ఒక కారణం అయింది.

ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నా లేనట్టుగానే ఉంది.అయినా ఇప్పటికీ, కేసీఆర్ చంద్రబాబు విషయంలో కత్తులు దూస్తూనే ఉంటున్నారు.

అదే జగన్ కు కూడా బాగా కలిసి వచ్చే అంశం.2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం టిఆర్ఎస్ అన్ని రకాలుగానూ సహకరించింది అనేది బహిరంగ రహస్యం.

కేసీఆర్, జగన్ ఇద్దరూ తెలంగాణ ఆంధ్ర విభజన అంశాలకు సంబంధించి గాని, ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో గాని, ఎటువంటి వివాదాలు కు వెళ్ళకుండా అన్నిటిని సక్రమంగా పరిష్కరించకుండా వస్తున్న సంగతి తెలిసిందే.

ఇంత వరకు బాగానే ఉన్నా, పోతిరెడ్డిపాడు, కృష్ణా జలాల విషయంలో ఇద్దరి మిత్రుల మధ్య కాస్త అభిప్రాయభేదాలు వచ్చాయి.

ఇక్కడ మిత్రత్వం కంటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమనే అభిప్రాయంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నా, వీటిని సామరస్య పూర్వకంగానే పరిష్కరించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే విమర్శలు చేసుకుంటున్నారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచేందుకు జగన్ మొగ్గు చూపిస్తున్నారు.శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల వద్ద తెలంగాణ నీళ్లను తోడేస్తోంది అని, దీని కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతోంది అని, సాగునీటికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది జగన్ వాదన.

ఇక కేసీఆర్ సైతం కృష్ణా జలాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ అంశంపైనే విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వ్యవహారం కేంద్రం వద్ద తేల్చుకునేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.ఈ మేరకు గురువారం జరిగే జాతీయ స్థాయి మీటింగ్ లో ఈ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు రెండు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

ఈ వ్యవహారంలో కేంద్రం పెద్దన్న పాత్ర లో రెండు రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈనెల ఎనిమిదో తేదీన ఈ సెటిల్మెంట్ జరగాల్సి ఉన్నా, కెసిఆర్ అభ్యంతరంతో దానిని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.

రేపు జరగబోయే ఈ మీటింగ్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాలతో పాటు, అనేక సమస్యలపైన పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.

కేవలం ఇప్పుడు తలెత్తిన వివాదాలు అన్ని, తాత్కాలికమని, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే మా మధ్య మనస్పర్థలు వచ్చాయని, తమ స్నేహం ఎక్కడ చెక్కుచెదరలేదు అనే అభిప్రాయాన్ని అటు జగన్, ఇటు కేసిఆర్  వ్యక్తం చేస్తున్నా, రేపు జరగబోయే పంచాయతీలో తేడాలు వస్తే ఈ ఇద్దరు మిత్రులు మధ్య వివాదం రేగుతుందా లేక ఎప్పటి పరిస్థితే కొనసాగుతుందా అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది.

వేలానికి హిట్లర్ సన్నిహిత మిత్రుడి విల్లా.. దాని విశేషాలు ఇవే..?