తెలంగాణ బోర్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద హై అలెర్ట్…!

సూర్యాపేట జిల్లా:టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టు నిరసిస్తూ.

హైదరాబాద్‌ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది.

దీనితో తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రా పోలీసులు హై అలెర్ట్ ప్రకటించి,వారిని కట్టడి చేసేందుకు మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ డీసీపీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు వద్ద ఆదివారం భారీగా పోలీసుల మొహరించి హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీలు చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది.

బోర్డర్ వద్ద ఐడి కార్డులు,వివరాలను తెలుసుకున్న తర్వాతే వాహనాలను వదిలిపెడుతున్నారు.ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలు( Rajahmundry Central Jail ) వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు.

ఇదిలా ఉంటే పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు.

బ్యాచులుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ వివిధ మార్గాల ద్వారా రాజమండ్రికి చేరుకున్నట్టు సమాచారం.

అయితే ఐటీ ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు భారీగా బలగాలను రంగంలోకి దించారు.