టికెట్ ఎవరికో తెలియదు.. నేతల మధ్య సఖ్యత లేదు ! కాంగ్రెస్ కు అన్నీ కష్టాలే ? 

తెలంగాణలో ఎన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నా, కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

ఎప్పుడూ  గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూ వస్తున్న కాంగ్రెస్ కు కీలకమైన ఎన్నికల సమయంలోనూ ఆ తలనొప్పులు తప్పడం లేదు.

మునుగోడులో త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాల్సి ఉన్నా,  ఈ సమయంలోను గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ లో కాక రేపుతున్నారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం కాబోతున్నాయి.ఈ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదపాల్సి ఉన్నా,  ఈ సమయంలోనూ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమను కలుపుకు వెళ్లడం లేదని , తాము సూచించిన వారిని అభ్యర్థిగా నిలబెట్టాలని ఇలా రకరకాల కారణాలతో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీలు పెడుతున్నారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయాన్ని దక్కేలా చేసి తన ప్రాధాన్యాన్ని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తుండగా, సీనియర్లు సహకారం అంతంత మాత్రంగానే ఉంది.

  ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఫైనల్ చేశారు.వారిలో ఒకరిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నా, ఇప్పటికీ దానిపై ఒక క్లారిటీ రాలేదు.

ఈ మేరకు అధిష్టానానికి ఆశావాహుల జాబితాను పంపించినా,  కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సైతం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు .

మరోవైపు చూస్తే బిజెపి, టిఆర్ఎస్ లో దూకుడుగా జనాల్లోకి వెళ్తున్నాయి.  """/" / బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా,  టిఆర్ఎస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో భట్టి విక్రమార్క సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా కొన్ని పేర్లను ఎంపిక చేసి ఆశవాహులను గాంధీ భవన్ కు పిలిపించి మాట్లాడుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్.పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ లు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఉండగా వీరిలో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

"""/" / ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీకి పంపించారు.

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఎప్పటి వరకు అభ్యర్థి ఎవరనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కాని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గానీ తేల్చుకోలేకపోతున్నారు.

  ఒకవైపు గ్రూపు రాజకీయాలను చక్కదిద్దుకుంటూనే మరోవైపు అభ్యర్థిని ఫైనల్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నా, ఆ స్థాయిలో ఆయనకు సీనియర్ నాయకులు నుంచి సహకారం అందడం లేదట.