అనుమతి లేనిదే ర్యాలీలు,సభలు,సమావేశాలు నిర్వహించరాదు:జిల్లా ఎస్పి చందనా దీప్తి

పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో రాజకీయ పార్టీల,ఇతర సంఘాల నాయకులు ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించరాదని,ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి)ని ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పి చందనా దీప్తి( District SP Chandana Deepthi ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సభలు,సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించేటప్పుడు రాజకీయ పార్టీలు( Political Parties ) ముందస్తు దరఖాస్తు పెట్టుకొని,దరఖాస్తులో తేది ప్రారంభ సమయం,స్థలం, రూట్,ముగింపు సమయం తెలియజేసి,నోడల్ అధికారి అనుమతి పొందిన తరువాత అనుమతుల్లోని నిబంధనల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రచారాలకు ఉపయోగించే వాహనాలకు,మైకులకు ముందస్తుగా నోడల్ అధికారి అనుమతి పొందాలని,ఎన్నికల ప్రచార ర్యాలీకి మూడు వాహనాలకు మాత్రమే వరసగా వెళ్ళుటకు అనుమతి ఉంటుందని, అంతకు మించి ఎక్కువ వాహనాలు ఉన్నప్పుడు ప్రతి మూడు వాహనాలకు కనీసం 100 మీటర్ల దూరంలో ఖాళీ ఉండే విధంగా వెళ్లాలన్నారు.

సభలు,సమావేశాలు నిర్వహించినప్పుడు నిర్ణీత కాలవ్యవధిలో నోడల్ అధికారి( Nodal Officer ) ఇచ్చిన అనుమతి ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేయాలని,ఎట్టిపరిస్థితుల్లో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రచారాలకు అనుమతి లేదని,ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు,ప్రార్థనా మందిరాలలో సభలు, సమావేశాలు,ప్రచారాలు నిర్వహించరాదన్నారు.

ప్రచార వాహనాలకు అనుమతిపొందిన పత్రాన్ని వాహన ముందు భాగంలో కనిపించే విధంగా అద్దానికి అతికించాలని,అదేవిధంగా అనుమతిలో ఉన్న విధంగా మాత్రమే మైకులు అమర్చాలని,ఎవరైనా పై నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం ఖరీదు.. ఓ వ్యక్తి ఉద్యోగం.!