Canada : కెనడాలో భారతీయ దౌత్యవేత్తలను బెదిరించారు.. చర్యలు తప్పవు : జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

లండన్‌లోని భారత హైకమీషన్‌పై , శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై గతేడాది జరిగిన దాడులతో పాటు కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ( Minister Dr S Jaishankar ) సోమవారం తెలిపారు.

కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడంతో భారత్ వీసాల జారీని నిలిపివేయాల్సి వచ్చిందని జైశంకర్ అన్నారు.

ఆ సమయంలో కెనడియన్ యంత్రాంగం నుంచి తమకు పరిమిత స్థాయిలోనే మద్ధతు దొరికిందని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు టీవీ9 నెట్‌వర్క్( TV9 Network ) నిర్వహించిన సమ్మిట్‌లో జైశంకర్ పేర్కొన్నారు.

"""/" / గతేడాది సెప్టెంబర్‌లో కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారతదేశం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) చేసిన వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే కొన్ని వారాల తర్వాత వీసా సేవలను పున: ప్రారంభించారు.ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.

ఖలిస్తాన్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక శక్తులకు చోటివ్వొద్దని న్యూఢిల్లీ పదే పదే కెనడా ప్రభుత్వాన్ని కోరింది.

"""/" / గతేడాది మార్చి 19న లండన్‌లోని భారత హైకమీషన్‌పై కొందరు ఖలిస్తానీ మద్ధతుదారులు( Khalistani Supporters ) దాడి చేశారు.

జూలైలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ఇండియన్ కాన్సులేట్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు.అనంతరం సెప్టెంబర్‌లో కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు సైతం ఎదురయ్యాయి.

మా దౌత్యవేత్తలు సురక్షితంగా విధులకు వెళ్లే పరిస్ధితులు లేకపోవడంతో కెనడాలో వీసాల జారీని నిలిపివేయాల్సి వచ్చిందని జైశంకర్ తెలిపారు.

దౌత్యవేత్తలను అనేక రకాలుగా బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని.అయినప్పటికీ కెనడా నుంచి తగిన విధంగా మద్దతు లభించలేదని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.