లోకేష్ కన్ను పెద్ద పదవిపైనే పడిందంటగా ?
TeluguStop.com
పార్టీ అధికారంలో లేకపోవడంతో నాయకులకు పార్టీ పదవులు మినహా మరే ఇతర పదవులు దక్కే అవకాశం లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు చాలాకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.
ప్రస్తుతం టిడిపి జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
తన వయసు కూడా లెక్కచేయకుండా, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.చంద్రబాబు సామర్థ్యం పైన ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు.
వాస్తవంగా ఆయన లేకపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే చంద్రబాబు వయసు పైబడుతుండడంతో తర్వాత పార్టీని ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లగల సమర్ధుడైన నాయకుడు ఎవరు అనేది చాలా కాలంగా అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.
చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ పేరు పరిగణలోకి వస్తున్నా, ఆయన పనితీరు , సమర్థతపై చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు ఏ ఒక్కరికి నమ్మకం లేదు.
అసలు లోకేష్ పార్టీలో ఉన్నా పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదనేది చాలామంది పార్టీ నాయకుల అభిప్రాయం.
ఇదే అభిప్రాయం చంద్రబాబులోనూ ఉంది.అసలు ఆయనకు గత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సైతం ఇష్ట పడలేదు.
కానీ కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు ఒత్తిడితో లోకేష్ కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి దక్కాయి.
కీలకమైన ఐదు శాఖలను కూడా లోకేష్ చూసేవారు.అయితే ఆ సమయంలోనూ పార్టీ పైన, ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు.
ఇక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు.
ఇక అప్పటి నుంచి ట్విట్టర్ ద్వారా మాత్రమే తప్ప ప్రత్యక్షంగా ప్రజల్లోకి , పార్టీ శ్రేణుల ముందుకు వచ్చేందుకు లోకేష్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా లోకేష్ పార్టీ పదవిలో ఉన్నారు.
అయినా ఆయన పార్టీకి పెద్దగా ఉపయోగపడింది లేదు.అయితే ఇప్పుడు లోకేష్ కన్ను టిడిపి అధ్యక్ష పదవి పై పడినట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు.ఆయన ఉండగా ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టేందుకు ఏ మాత్రం పడరు.
ఎందుకంటే చంద్రబాబు పార్టీ అధ్యక్ష పీఠం నుంచి తప్పుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు.
అందులోనూ లోకేష్ సమర్థతపై బాబుకు అవగాహన ఉంది.అందుకే లోకేష్ టీడీపీ అధ్యక్ష పీఠం కావాలని గత కొంతకాలంగా చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నా, ఆయన మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది.
లోకేష్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అధ్యక్ష పదవి అప్పగించాల్సి ఉన్నా, ఆ విషయంలో మాత్రం ధైర్యంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
మరి చినబాబు కోరిక ఎప్పటికి తీరుతుందో, అధ్యక్ష పీఠం అసలు దక్కుతుందో లేదో చూడాలి.
ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు..!!