అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ: చికాగోలో కాల్పుల మోత, 8 మంది మృతి.. భారీగా క్షతగాత్రులు

గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్‌వేలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరోసారి ఉన్మాదులు రెచ్చిపోయారు.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో ఈ వీకెండ్‌లో పలు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది మరణించగా.

16 మంది వరకు గాయపడ్డారు.శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్‌పాట్రిక్‌లోని 300 బ్లాక్‌లో 69 ఏళ్ల వ్యక్తిని ఛాతిపై కాల్చడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఈ వారాంతంలో నమోదైన తొలి కేసు ఇదే.అదేరోజు సాయంత్రం సౌత్ ఇండియానాలోని 3400 బ్లాక్‌లో మరో 40 ఏళ్ల వ్యక్తి తుపాకీ కాల్పుల్లో మరణించాడు.

కాల్పుల ఘటనలపై స్పందించిన చికాగో పోలీసులు .శుక్రవారం నాడు జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించినట్లు వెల్లడించారు.

అయితే శనివారం నాడు చోటు చేసుకున్న మరికొన్ని కాల్పుల ఘటనలతో మరణించిన వారి సంఖ్య ఆరుకి చేరుకుంది.

అయితే ఆదివారం కూడా ఉన్మాదులు రెచ్చిపోయారు.నిన్న మరో ఇద్దరు ఈ తరహా ఘటనల్లో మరణించినట్లుగా తెలుస్తోంది.

బ్రైటన్ పార్క్, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జీ అవెన్యూ, హంబోల్ట్ పార్క్, చికాగోస్ లూప్‌లలో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పెరుగుతున్న తుపాకీ హింస ఒక వర్గం ప్రజలతో పాటు చట్టసభ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.

గన్ వయోలెన్స్ ఆర్కైవ్ ప్రకారం.2022లో ఇప్పటి వరకు అమెరికాలో 140కి పైగా సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

మరోవైపు చికాగో నగరంలో నేరాలు పెరుగుతున్నాయి.చికాగో సన్ టైమ్స్ నివేదిక ప్రకారం .

2021 అక్టోబర్ చివరి నాటికి నగరంలో తుపాకీ కాల్పుల్లో 617 మంది ప్రాణాలు కోల్పోగా.

3,768 మంది గాయపడ్డారు.ఈ కేసులలో చాలా వరకు నగరంలోని సౌత్, వెస్ట్ ఏరియాలలోనే నమోదయ్యాయి.

ఇకపోతే.చికాగోలో గతేడాది దాదాపు 800 హత్యలు జరిగాయట.

ఇది న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాల కంటే ఎక్కువ కావడం గమనార్హం.