అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం: మంత్రి తుమ్మల

సూర్యాపేట జిల్లా:రైతులు వరి పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి మొగ్గు చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(, Minister Thummala) అన్నారు.

శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో(Uttam Padmavathi Reddy) కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా,వరి పంటకు బోనస్ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రైతుల నుండి సలహాలు,సూచనలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా నిధులు నిజంగా పంట పండించే రైతుకు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని,గత ప్రభుత్వం చేసిన తప్పులు తమ ప్రభుత్వం చేయదన్నారు.

ఇంకా నాలుగు జిల్లాల్లో రైతుల నుండి అభిప్రాయాల సేకరణ జరుగుతుందని,ఆ వెంటనే రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు.

మూడో విడత రుణమాఫీ నిధులు ఆగస్టు 15న విడుదల చేస్తామని ఇంకా అర్హత కలిగి రుణమాఫీ కాని రైతుల జాబితాను సేకరించి,తప్పులను సరిచేసి 15 తర్వాత అందరి రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు.

ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని, అదేవిధంగా రైతులు అధిక మోతాదులో యూరియా, పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు.

పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రూ.55 వేలు సబ్సిడీని అందజేస్తున్నామని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,ఎర్నేని బాబు,ఆర్డీవో  సూర్యనారాయణ,వ్యవసాయ అధికారి రజిని,ఇర్ల సీతారాంరెడ్డి,బచ్చు అశోక్, ముస్తఫా,బాగ్దాద్,శేషు,శమి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సమంత నాగచైతన్య విడాకులకు శోభిత కారణమా.. వైరల్ అవుతున్న ప్రీతమ్ పోస్ట్?