కొప్పోలు పశు వైద్య ఉపకేంద్రం లైవ్ స్టాక్ అసిస్టెంట్ సస్పెండ్

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని పశు వైద్య ఉపకేంద్రం లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్య విధులకు సరిగా రావడం లేదని,అంతేకాక పశువులకు చికిత్స సైతం అందించడం లేదని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా గ్రామస్తులు ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ గుర్రంపోడు మండలం కొప్పోలులో వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా జిల్లా కలెక్టర్ పశు వైద్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను,మందుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.

పశు వైద్య ఉప కేంద్రం దగ్గరికి వచ్చిన రైతులతో రుణమాఫీపై మాట్లాడి రుణమాఫీ అయింది లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి ఫీవర్ సర్వే ఎలా నడుస్తున్నదని?ఎవరు నిర్వహిస్తున్నారని? గ్రామంలో ఎంత మందికి జ్వరాలు వచ్చాయని అంగన్ వాడి టీచర్ ను అడగడమే కాకుండా, ఫీవర్ సర్వే రిపోర్ట్ ను సైతం పరిశీలించారు.

అంతేకాక అంగన్వాడి కేంద్రంలో పిల్లల నమోదు రిజిస్టర్,పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం,వంట సామాగ్రిని తనిఖీ చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో స్వచ్ఛదనం - పచ్చదనం కింద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామమంతా తిరిగి పరిశీలించారు.

అక్కడక్కడ మురికి కాలువలలో ఇంకా పిచ్చి మొక్కలు ఉండడాన్ని గమనించి వాటిని తీసివేయాలని, మురికి కాలువలు శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై ఏలాంటి చెత్త, చెదారం ఉండరాదని,పిచ్చి మొక్కలను తొలగించాలని ఎంపీడీవో మంజులను ఆదేశించారు.

ఇదే విషయం జిల్లా పంచాయతీ అధికారి మురళితో ఫోన్లో మాట్లాడి అన్ని గ్రామాలలో ఎలాంటి చెత్తా,చెదారం ఉండకుండా చూసుకోవాలని,ప్రత్యేకించి పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు.

రహదారులతో సహా మురికి కాలువలన్ని శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి హాజరు రిజిస్టరు,మందుల స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.

వంటగదిని,మధ్యాహ్న భోజనం,వంట సామాగ్రి, బియ్యాన్ని తనిఖీ చేశారు.పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద చేపట్టిన పనులను తనిఖీ చేశారు.

వంటగదిని, భోజనాన్ని తనిఖీ చేసి వంట వారితో, ఉపాధ్యాయులతో మాట్లాడారు.బియ్యం ఎలా ఉన్నాయని? భోజనం ఎలా వండుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

అద్భుతం చేసిన కెప్టెన్ రోహిత్.. వీడియో వైరల్