ఏపీ - తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్

ఆంధ్ర- తమిళనాడు సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.నిన్న వడమాలపేట టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

టోల్ ప్లాజా వద్ద తమిళనాడు యువ న్యాయవాదులపై స్థానికులు దాడి చేసిన విషయం తెలిసిందే.

అయితే, దాడి ఘటనపై తమిళనాడు లాయర్స్ అసోసియేషన్ మండిపడుతోంది.ఈ క్రమంలో తమిళనాడు లాయర్స్ అసోసియేషన్ బృందం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి గొడవకు దిగుతారని, తమిళనాడులో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను అడ్డుకుంటారని ప్రచారంలో ఊపందుకుంది.

ఇందుకు సంబంధించిన మెసేజ్ లు పలు వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కూలేట్ అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ పోలీసులు సరిహద్దుల్లో తమిళనాడు పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.