ఎడమకాల్వ గండి పూడ్చడంలో మంత్రి ఉత్తమ్ విఫలం:మాజీ ఎమ్మెల్యే బొల్లం

సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడి 12 రోజులైనా దానిని పూడ్చడంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు.

మంగళవారం కోదాడ మండలంలోని గణపవరం,ఎర్రవరం, రామలక్ష్మిపురం,బిక్యాతండా, తొగర్రాయి గ్రామాలలో పర్యటించి,ఎడమ కాలువ ఆయకట్టు కింద ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి పడడం ద్వారా మునిగింది 500 ఎకరాలైతే గండి పూడ్చడంలో విఫలం చెందడం వల్ల 50 వేల ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు.

గండిపడి 12 రోజులు దాటిన నేటికీ పనులు పూర్తి కాకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి రైతాంగంపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు.

వారం రోజుల్లో గండి పూడిపిస్తానని ఇచ్చిన హామీని మంత్రి ఉత్తమ్ నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

వేల రూపాయలు అప్పులు చేసి,గత మూడు నెలలుగా శ్రమించి వరి పంట సాగు చేసిన రైతాంగానికి కడగండ్లు మిగిలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండుసార్లు పర్యటించానని ప్రకటించుకోవడం కాదని, గండిని దగ్గరుండి పూడిపించాలని డిమాండ్ చేశారు.టెండర్ల పేరుతో కమిషన్ల కోసం కాలయాపన చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న పాలకులపై రైతాంగం పెద్ద ఎత్తున ‌ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని,యుద్ధ ప్రాతిపదికన గండి పూర్తి చేయకపోతే రైతంగంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎడమ ఆయకట్టు రైతులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీచ్‌లో అందాలు ఆరబోస్తూ సెగలు రేపిన ఐశ్వర్య.మీనన్