అక్కడ వంటలు చేయడానికి మసాలాగా మట్టిని వాడతారట?

మన భారతీయ వంటకాల్లో మసాలాలు విరివిగానే వాడుతామని చెప్పుకోవాలి.అయితే ఇక్కడ ఎక్కువగా మసాలా దినుసులుగా ప్రకృతిని నుండి వచ్చిన మూలికలను, వేళ్ళను ఇంకా ఇతర వస్తువులను వాడుతారే తప్ప, మట్టిని వాడరు.

అలాగే దీనికి అనుగుణంగా నేడు మార్కెట్లో కూడా వెరైటీ మసాలాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఏ మసాలా అయినా పలు రకాల దినుసులతో తయారు చేస్తారు.కానీ, ఓ ఐలాండ్‌లో మాత్రం మట్టినే మసాలాగా చేసుకొని వాడటం ఇపుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఫాస్ట్‌ఫుడ్‌లో సాస్‌లా కూడా అక్కడ దానిని ఉపయోగించడం కొసమెరుపు.అయితే ఆ మసాలాతో చేసిన వంటకాలు చాలా రుచిగా వుంటాయని స్థానికులు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే, ఇరాన్ తీరానికి 8 కి.మీ దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో హోర్ముజ్ అనే ఐలాండ్‌ ఉంది.

ఈ ఐలాండ్‌లో ఎటుచూసినా పసుపు, నీలం, ఎరుపు రంగు గుట్టలే కనిపిస్తాయి.అచ్చం ఇంద్ర ధనస్సులా కనిపించే ఈ ప్రాంతాన్ని "రెయిన్‌బో ఐలాండ్" అని కూడా అంటారు.

అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్లే రంగు రంగుల గుట్టలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేల్చారు.

"""/"/ అయితే అక్కడ లభించే ఎర్రమట్టిని ప్రజలు వంటకాల్లో మసాలాగా ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు.

ఆ మట్టిని వారు "గెలాక్" అని కూడా పిలుస్తారు.ఈ మట్టి నుంచి సూరఖ్ అనే పదార్థాన్ని తయారు చేసి సాసుగా కూడా ఉపయోగిస్తారు.

మనం సాధారణంగా ఉపయోగించే సాసు కంటే ఇది పది రెట్లు రుచిగా ఉంటుంది.

అక్కడికి వెళ్లిన పర్యాటకులు ఈ సాసు రుచి చూడడానికి ఎగబడుతారట.అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన హేమటైట్‌ అనే ఐరన్‌ ఆక్సైడ్‌ వల్ల ఈ మట్టి ఏర్పడిందని అంటున్నారు.

ఈ స్టోరీ చదివితే మీకు కూడా అక్కడికి వెళ్లాలని అనిపిస్తోంది కదూ.