కన్నవారికి అసలైన గుండెకోత ఎప్పుడో తెలుసా?

కన్నవారికి అసలైన గుండెకోత ఎప్పుడో తెలుసా .కళ్లెదుటే బిడ్డల్ని బొందల గడ్డలో పెట్టినప్పుడు .

ఆ కడుపుకోత ఎవరూ తీర్చలేనిది .పెళ్లయినా ఐదేళ్లకే భర్తని కోల్పోయిన ఆమె .

కొడుకే జీవితంగా బతికింది .ఆమె ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది .

ఐదేళ్లకే భర్తని తీసుకుపోయిన ఆ దేవుడికి ఆమె మీద కోపం ఇంకా తగ్గలేదేమో .

చేతికందే వయస్సులో 24 ఏళ్లు వచ్చిన తన కొడుకును కూడా కోల్పోయేలా చేశాడు .

ఏకాకైన ఆమే చివరికి కన్నకొడుకు చితికి తలకొరివి పెట్టాల్సిన గతి పట్టింది .

ఒక తల్లికి ఇంతకి మించిన గుండెకోత మరోటి ఉండదేమో .! సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన గేదెల మోహన్ రావు ( 24 ) విశాఖపట్నంలో బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు .

తండ్రి రమేశ్ తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోగా .అన్నీ తానై తల్లి ఢిల్లమ్మ కొడుకును పెంచింది .

కూలి పనులు చేసుకునే ఢిల్లమ్మకు కొడుకు మోహన్ రావు ఆర్థిక అండగా నిలుస్తూ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నారు .

ఈ క్రమంలో ఈ నెల 10 వ తేదీన ఇంటి పనులు చేస్తుండగా .

భవనం నుంచి జారి కిందపడ్డాడు .దాంతో తలతో పాటు ఇతర భాగాలకూ గట్టి దెబ్బలు తగిలాయి .

వెంటనే మోహన్ రావును విశాఖపట్నంలోని కేజీహెచ్ చేర్పించారు .అయితే , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ రావు శనివారం మృతిచెందాడు .

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామమైన కాపుగోదాయవలస గ్రామానికి తీసుకొచ్చారు .కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో తల్లి ఢిల్లమ్మే తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది .

ఇది చూసిన గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు .