కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే కేసీఆర్ పై ఫిర్యాదు

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రోజే మాజీ సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నల్లగొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పోలవరం కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాగు,సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని, నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని అందులో ఆరోపించారు.

తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్, మెదక్,వరంగల్,నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగిందన్నారు.

మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అయితే పనులు జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్,ఎంపీగా కవిత ఎన్నికయ్యారని,ఆతర్వాత వీరంతా ప్రాజెక్టు అలైన్మెంట్లు,డిజైన్లు మార్చివేసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిని, అంచనాలను పెంచారని ఆరోపించారు.

మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని,దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీ వద్ద లీకులు కనిపించాయని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే ఏసీబీకి ఈ ఫిర్యాదు రావడంతో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్