అటకెక్కేసిన మెగా ప్రాజెక్ట్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తవ్వగా, కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆచార్య చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే, మెగాస్టార్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ కాగా, తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వేదాళం’ను కూడా రీమేక్ చేసేందుకు చిరు ప్లాన్ చేస్తు్న్నాడు.

అయితే ఎప్పటినుండో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని చిరు భావిస్తున్నాడు.

కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో, ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి.

దీంతో మెగా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి.

కానీ త్రివిక్రమ్ ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఈ ఏడాదిలో అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న త్రివిక్రమ్, తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడు.

అటుపై మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా వరుసగా ఇతర హీరోలతో సినిమాలు చేయనున్న త్రివిక్రమ్ మెగాస్టార్‌తో ప్రస్తుతానికి ఎలాంటి సినిమాను చేయకపోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అంటే ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే అటకెక్కిందని సినీ వర్గాలు అంటున్నాయి.

గురుపత్వంత్ హత్యపై అంతర్జాతీయ మీడియాలో కథనం.. స్పందించిన అమెరికా