రాహుల్ గాంధీపై కేంద్ర నిర్ణయం నియంతృత్వ చర్య

సూర్యాపేట జిల్లా: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.

బీజేపీ మోడీ పాలనలో నియంతృత్వం పరకాష్టకు చేరుకున్నదని విమర్శించారు.ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడి దాడులు దర్యాప్తు సంస్థలను ఉపయోగించి నోరునొక్కే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.సూరత్ కోర్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష రాహుల్ గాంధీకి విధించిందని,దానితోపాటు నెలలోపు అభ్యంతరం ఉంటే పైకోర్టుకు పోవచ్చని తెలియజేశారని అన్నారు.

ఆయన పైకోర్టు పోవడానికి అవకాశాన్ని ఉన్నప్పటికీ నెల రోజులు వేచి చూడకుండా 24గంటల్లోపే తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకోవడమేనని అన్నారు.

ఇప్పటికైనా బీజేపీ నియంతృత్వ పోకడలకు రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు,వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక శక్తులు ఏకం కావాలని పిలుపనిచ్చారు.