సర్పంచ్ ఓట్ల పంచాయితీ షురూ…!

నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలుకానుంది.

గ్రామపంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగుస్తుంది.పంచాయితీ రాజ్ నూతన చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

అయితే,అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

అందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా విడుదల కానుందని సమాచారం.కాగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు వెళ్లాయని తెలుస్తుంది.

అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడం, కొత్త శాసనసభ కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సర్పంచ్‌ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారని,ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారుల నియామకం,ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ పేరుతో డిసెంబర్‌ 4న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామకార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్‌, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పదేళ్లకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది.

ఈ నేపథ్యంలో కిందటిసారి రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.ఒకవేళ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చాలని నిర్ణయం తీసుకుంటే,అధికారులు నిర్ణీత సమయంలో కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిస్తే తప్ప రిజర్వేషన్లు మారే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత సర్పంచ్‌ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి.గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్‌ సహా కొత్త కార్యవర్గం కొలువుదీరిన సంగతి అందరికీ తెలిసిందే.

అర్హతలు ఉన్నా సాయిపల్లవికి దక్కని అవార్డ్.. మరీ ఇంత అన్యాయమా అంటూ?