మునుగోడు మళ్ళీ ముంచేనా! పీకే రిపోర్ట్ లో దాగున్నదేమిటి?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ తీరు ఇందుకు బలాన్నిస్తోంది.
జిల్లాలు తిరగడం,పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరపడంతో త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో పర్యటిస్తుండటం మరింత హీటెక్కిస్తోంది.కేసీఆర్ కోసం పీకే టీమ్ తెలంగాణలో సర్వే చేస్తుందని తెలుస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.
ఇప్పటికే పీకే టీమ్ రెండు రౌండ్లు సర్వే పూర్తి చేసిందని,సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి,ప్రభుత్వంపై ప్రజల స్పందన,ఎమ్మెల్యే పని తీరు,విపక్ష ఎమ్మెల్యే ఉంటే అక్కడి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది,వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందనే అంశాలపై పీకే టీమ్ సమగ్ర రిపోర్టు ఇచ్చిందని తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పీకే టీమ్ ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో కేసీఆర్ ప్రత్యేకంగా సర్వే చేయించారట.మునుగోడు నియోజకవర్గానికి ప్రస్తుతం ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
ఆయన 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచారు.2018 ఎన్నికల్లో మాత్రం రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా మునుగోడులో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది.
పీకే టీమ్ సర్వేలో ప్రస్తుతం కూడా గులాబీ పార్టీ పరిస్థితి అంతమాత్రంగానే ఉందని తేలిందట.
పార్టీ ఇంచార్జ్ కూసుకుంట్లపై ప్రజలతో పాటు పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని సమాచారం.
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ రెండుగా చీలిపోయిందని పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది.
చౌటుప్పల్,మునుగోడులో కీలక పదవుల్లో ఉన్న నేతలతో కూసుకుంట్లకు పడటం లేదట.జడ్పీటీసీలు,ఎంపీపీలు కూడా ప్రభాకర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారట.
కూసుకుంట్ల ఒంటెద్దుపోకడలకు పోతున్నారని,తనకు కావాల్సిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్త నేతలు బహాటంగానే చెబుతున్నారట.
పార్టీ పదవుల్లోనూ తన అనుచరులనే అందలం ఎక్కించారనే ఆరోపణలు కూసుకుంట్లపై వస్తున్నాయని పీకే టీమ్ నివేదిక ఇచ్చిందట.
చౌటుప్పల్,చండూరు మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అక్రమాలకు కూసుకుంట్ల వంత పాడుతున్నారనే భావనలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది.
పీకే టీమ్ నివేదక ఆధారంగా వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారని
టీఆర్ఎస్ వర్గాల సమాచారం.
కొత్త నేత కోసం కేసీఆర్ కసరత్తు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం,రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అభ్యర్థి ఎంపికకు గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది.
గతంలో టికెట్ కోసం ప్రయత్నించిన ఓ బీసీ నాయకుడు మునుగోడులో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
సదరు నేతకు జిల్లా మంత్రి అండదండలు కూడా ఉన్నాయని,ఆర్థికంగా కూడా బలంగానే ఉండటంతో ఆ నేతకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందో సర్వే చేయాలని పీకే టీమ్ కు కేసీఆర్ సూచించారని తెలుస్తోంది.
కేసీఆర్ ఆదేశాలతో బీసీ నేత గురించి నియోజకవర్గంలో పీకే టీమ్ వివరాలు సేకరిస్తోందని చెబుతున్నారు.
ఆ మూవీ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!