తహశీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి:మండల సర్పంచ్ ల ఫోరమ్

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండల తహశీల్దార్ విధులకు డుమ్మాకొట్టి, ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మండలం సర్పంచ్ ల ఫోరమ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఫోరమ్ నాయకులు మాట్లాడుతూ మర్రిగూడ మండల తహశీల్దార్ పుష్పలత శుక్రవారం విధులకు ఎగానం పెట్టి అధికార పార్టీకి చెందిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్వహించే అనధికార కార్యక్రమాల్లో పాల్గొనడం ఏమిటని ప్రశ్నించారు.

మండల ప్రభుత్వ అధికారిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన తహశీల్దార్ అధికార పార్టీ నాయకులతో కుమ్మకై,గ్రామాల సర్పంచ్ లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వివిధ గ్రామాల్లో తిరుగుతూ కళ్యాణలక్ష్మి/షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తహశీల్దార్ ప్రోటోకాల్ పాటించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాల ప్రథమ పౌరులను అగౌరపరుస్తున్నారని ఆరోపించారు.

జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే తహశీల్దార్ చర్యలపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ లు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, శనివారం 2024