కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిటికంటే చిత్ర పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఈ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, సీరియల్స్ కూడా చాలా తక్కువ మంది నటులతో చేయడం వలన జూనియర్ ఆర్టిస్ట్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, ఇతర క్రాఫ్ట్ ల వారికి పనిలేకుండా పోయింది.
హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ మీద వేల సంఖ్యలో కార్మికులు రోజువారీ కూలి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.ప్రస్తుతం వీరి పరిస్థితి దుర్భరంగా తయారైంది.
దీనిని వదిలి వేరొక పనికి పోదామన్న చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.మరో వైపు ఈ కరోనా కష్టకాలంలో ఆర్ధిక బాధలు తట్టుకోలేక కొంత మంది తనువు చాలిస్తున్నారు.
తాజాగా ఓ సీరియల్ నటి అప్పులబాధతో ఆత్మహత్య చేసుకుంది.మద్దెల సబీరా, అలియాస్ రేఖ నటనపై అభిమానంతో హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించారు.
అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు.
అనంతరం చైతన్యను వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం విద్యానగర్లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వేడుకల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు.
అయితే, గత రెండేళ్లుగా అది కూడా మానేశారు.ఈ మధ్యకాలంలో సీరియల్స్ లో మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కరోనా కష్టకాలం కారణంగా అవకాశాలు కూడా లేకపోవడంతో మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు.చుట్టుముట్టిన కష్టాలతో కలత చెందిన ఆమె నిన్న స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు.